వైసీపీ నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్ ? అరెస్సెస్ వాదికి మద్దతేంటన్న షర్మిల..!
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్న కేంద్రంలో బీజేపీతో దోస్తీ మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి పూర్తిగా మద్దతునిచ్చిన వైసీపీ.. ఇప్పుడు రాష్ట్రంలో కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు ఇచ్చిన మద్దతే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో బీజేపీ-వైసీపీ మధ్య బంధం మరోసారి బయటపడిందని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
వైసీపీ ముసుగు మళ్ళీ తొలగిందని, లోపలున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని షర్మిల విమర్శించారు. బీజేపీకి బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. మోడీకి జగన్ దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యిందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. వైసీపీ బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైందన్నారు. అందుకే బీజేపీ అంటే "బాబు - జగన్ - పవన్" అని షర్మిల గుర్తుచేశారు.

ముగ్గురూ బీజేపీ తొత్తులేనని, బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని షర్మిల విమర్శించారు. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు అని, వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు అని షర్మిల ఆరోపించారు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ, ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ అన్నట్లుందన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారన్నారు. ఐదేళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారన్నారు.

ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదని, మోడీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి ఆ పార్టీకి నోరు పెకలదని షర్మిల విమర్శించారు. మణిపూర్, గోద్రా అల్లర్లలో RSS చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారని, ఆయన అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారన్నారు. మోడీకి ఆపద వచ్చిందని అండగా నిలబడతారని, ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన ఆరెస్సెస్ వాదికి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications