వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం; జోధ్పూర్ ప్యాలెస్ లో రేపటినుండే పెళ్లిసంబరాలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి అట్లూరి ప్రియుల వివాహ వేడుక ఈనెల 17వ తేదీన జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది .
బుధవారం రోజు సాయంత్రం వైయస్ షర్మిల రెడ్డి కుటుంబ సమేతంగా జోధ్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు వైయస్ షర్మిల రెడ్డి తనయుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా 16వ తేదీ సంగీత్ మరియు మెహందీ కార్యక్రమం ఉంటుంది. 17వ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా వివాహవేడుకలో ఒకటి కానున్నారు. ఇక 18వ తేదీ ఉదయం 11 గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆపై 18వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాలు వేడుకను నిర్వహించనున్నారు.
కుమారుడి నిశ్చితార్థ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన వైయస్ షర్మిల రెడ్డి కుమారుడి వివాహ వేడుకను కూడా అంతే ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తోంది. వైయస్ షర్మిల రెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుక జనవరి 18వ తేదీన హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడైన ఏపీ సీఎం జగన్ తో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైయస్ షర్మిల తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అయిన సోనియాగాంధీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం.
ఇక ఈ వివాహ వేడుకకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఒక టాక్ వినిపిస్తుంది. తన కుమారుడి వివాహ వేడుకకు పలువురు సినిమా ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను వైయస్ షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ వివాహ వేడుకలో జగన్ కనిపిస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications