ఏపీ రాజకీయాలపై రేవంత్ కామెంట్స్: వాళ్లకు టికెట్లు మేమిస్తాం: షర్మిల భవిష్యత్తుపైనా జోస్యం
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయ చదరంగాన్ని మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. తన తొలి అస్త్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఎక్కుపెట్టారు. అది కూడా.. ఆయన చెల్లెలు షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఓ తెలుగు న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అనేక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల చుట్టూ ఎక్కువగా నడించిందీ బిగ్ డిబేట్. వైఎస్ జగన్ పరిపాలన తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మీదా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్నీ గుర్తు చేసుకున్నారాయన ఈ సందర్భంగా.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటివరకు వైఎస్ జగన్.. తనకు ఫోన్ కాల్ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రలు ఫోన్ చేసి, అభినందిస్తుంటారని, ఇప్పటి వరకు జగన్ నుంచి అలాంటి కాల్ రాలేదని చెప్పారు.
అదే సమయంలో- షర్మిల గురించీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అపాయింట్ అవుతారని తేల్చి చెప్పారు. ఆమె సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటుందని పరోక్షంగా వెల్లడించారు. త్వరలోనే దీనిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఏపీలో వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కని నాయకులను తాము పార్టీలోకి చేర్చుకుంటామని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. వాళ్లకు టికెట్లు తామే ఇస్తామనీ భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారాయన.
అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత తెలంగాణలో గెలుపుపై ధీమా ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులే ఏపీలోనూ వస్తాయని చెప్పారు. కర్ణాటక, తెలంగాణల్లో ఇచ్చిన ఊపు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ నిలబడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications