వివేకా కేసులో కీలక పరిణామం- సీబీఐ కస్టడీకి శంకర్ రెడ్డి- నోరు విప్పితే అంతే సంగతులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ పులివెందుల కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మరో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారి శంకర్ రెడ్డి పేరు చెప్పిన నేపథ్యంలో ఆయన్ను విచారించేందుకు వీలుగా సీబీఐ కస్టడీ పిటిషన్ వేసింది. దీన్ని పులివెందుల కోర్టు ఆమోదించింది.
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేకానందరెడ్డిని చంపితే రూ.40 కోట్లు ఇస్తాడని మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని, ఇందులో తనకు రూ.5 కోట్లు ఇస్తామన్నారని అప్రూవర్ గా మారిన దస్తగిరి వెల్లడించాడు. దీంతో సీబీఐ ఈ వాదనపై శివశంకర్ రెడ్డి నుంచి మరిన్నివివరాలు రాబట్టాలని భావిస్తోంది. సీబీఐ కస్టడీలో శివశంకర్ రెడ్డి నోరు విప్పితే ఈ కేసు గుట్టు పూర్తిగా వీడుతుందని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి వాంగ్మూలంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
ఈ కేసులో శివశంకర్ రెడ్డి డబ్బులిస్తాడని, అలాగే తమ వెనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారని దస్తగిరి ఆరోపించాడు. దీంతో తాను ఈ హత్యకు సహకరించినట్లు దస్తగిరి అంగీకరించాడు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుున్న వీరంతా తమకు ఏపాపం తెలియదంటున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ రెడ్డి నోటి వెంట వెలువడే వాస్తవాలపై సీబీఐ ఆశలు పెట్టుకుంది. సీబీఐ ఆశించినట్లుగా శివశంకర్ రెడ్డి కస్టడీలో నోరు విప్పితే ఈ కేసు గుట్టు పూర్తిగా వీడే అవకాశాలు ఉన్నాయి. దీంతో శివశంకర్ రెడ్డికి విధించిన వారం రోజుల కస్టడీ, అందులో సీబీఐ అడగబోయే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు పులివెందులలోనే శివశంకర్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది.