అవినాష్ కు వివేకా జమ్మలమడుగు ఆఫర్ -ఆ రోజు జరిగిందిదే- వైఎస్ ప్రతాపరెడ్డి వాంగ్మూలం
ఏపీలో పెను సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో మిస్టరీ క్రమంగా వీడిపోతోంది. గతంలో వివేకా హంతకుల్ని కూడా గుర్తించకుండానే ఏడాది పాటు కాలం గడిపేసిన సీబీఐ.. గత కొంతకాలంగా మాత్రం దుమ్ము దులుపుతోంది. దీంతో ఈ హత్యకు కారకులు, కారణాలతో పాటు ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి అనుమానితులు, నిందితులు, అప్రూవర్ దస్తగిరి బయటపెట్టిన విషయాలు సంచలనం రేపుతుండగా. గతేడాది వైఎస్ కుటుంబానికే చెందిన ప్రతాప్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కుండబద్దలు కొట్టింది.
వివేకా హత్యపై వైఎస్ ప్రతాప్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, అందుకు దారి తీసిన పరిస్ధితులపై వైఎస్ కుటుంబానికి చెందిన అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి గతేడాది సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇప్పటివరకూ వైఎస్ కుటుంబానికి బయట వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలతో సరిపోలుతుండటం, అలాగే అంతకు మించిన కారణాలు కూడా వెలుగు చూస్తుండటంతో ప్రతాప్ రెడ్డి వాంగ్మూలం వైఎస్ కుటుంబంలోనూ కలకలం రేపుతున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్యలో అవినాష్ పాత్ర ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్లో అనుమానాలు వ్యక్తంచేసింది. వాటిని నిర్ధారించుకునేందుకు, నిరూపించేందుకు తగిన ఆధారాల కోసం సీబీఐ వేట సాగిస్తోంది. దీంతో పలు కొత్త అంశాలు సైతం వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సీబీఐ గతంలో అవినాష్ రెడ్డిపై వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతాప్ రెడ్డి వాంగ్మూలం ఇప్పుడు అన్నింటికంటే కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికే చెందిన ప్రతాప్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ తీసుకోబోయే చర్యలపైనా ఉత్కంఠ పెరుగుతోంది.
కడప ఎంపీకి బదులు జమ్మలమడుగు ఎమ్మెల్యే
వైఎస్ అవినాష్ రెడ్డిని కడప ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వొద్దనే అంశంలో వివేకానందరెడ్డి పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తాజాగా వైఎస్ ప్రతాప్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీకి బదులుగా జమ్మల మడుగు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డిని నిలబెడదామని వివేకా ప్రతిపాదించినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కడప ఎంపీగా అవినాష్ స్ధానంలో షర్మిల లేదా విజయమ్మకు అవకాశం ఇద్దామని వివేకా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అవినాష్ తీవ్రంగా వ్యతిరేకించారు.
జమ్మలమడుగులో అవినాష్ ఎందుకంటే ?
కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని జమ్మల మడుగు ఎమ్మెల్యేగా పంపాలని తీసుకున్న నిర్ణయం వెనుక పలు కీలక కారణాలు కూడా ఉన్నాయి. జమ్మల మడుగులో అప్పటికే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య వివాదాలు ఉన్నాయి. వీరిద్దరూ బలవంతులు కూడా. వీరిద్దరిపై పోటీ పడి గెలిచే సత్తా వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న డాక్టర్ సుధీర్ రెడ్డికి లేదని వివేకా భావించినట్లు తెలుస్తోంది. అందుకే అవినాష్ ను జమ్మలమడుగు పంపితే అక్కడ నుంచి వైసీపీ అభ్యర్దిగా సులువుగా గెలవొచ్చని వివేకా భావించారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వివేకా మధ్య కూడా ముందు నుంచీ విభేదాలు ఉన్నట్లు కూడా ప్రతాప్ రెడ్డి సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది.
రక్తపు మడుగులో వివేకాను చూడగానే...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన సోదరుడు మనోహర్ రెడ్డి ఫోన్ తో అక్కడికి వెళ్లిన ప్రతాప్ రెడ్డికి రక్తపు మడుగులో ఉన్న వివేకా కనిపించారు. దీంతో ప్రతాప్ రెడ్డికి వివేకా రక్తపు వాంతులతో గుండెపోటు వచ్చి చనిపోయారని మనోహర్ రెడ్డి చెప్పారు. కానీ ఇంట్లో పరిస్ధితులు, అక్కడున్న ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇనాయతుల్లాను చూసిన తర్వాత అది గుండెపోటు కాదని అర్ధమైందని ప్రతాప్ రెడ్డి సీబీఐకి చెప్పారు. పనిమనిషితో రక్తపు మరకల్ని ఎర్ర గంగిరెడ్డి, శంకర్ రెడ్డి క్లీన్ చేయించారని కూడా తెలిపారు. దీంతో ప్రతాప్ రెడ్డి వాంగ్మాలాన్ని బట్టి చూస్తే వివేకా హత్యకు కడప ఎంపీ టికెట్ కారణమైందని తెలుస్తోంది. ఇక మిగిలింది హత్యకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, చంపింది ఎవరనేది మాత్రమే.