వివాదం: వైఎస్ వివేకా అరెస్ట్, జేసీపై బాబు సీరియస్?
కడప/అనంతపురం: పులివెందుల బ్రాంచ్ కెనాల్కు అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గండి కొట్టించడంపై అనంతపురం, కడప జిల్లాల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం నాడు కెనాల్కు జేసీ గండి కొట్టించారని ఆరోపిస్తూ... కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి ఆందోళనకు దిగారు.
కడప జిల్లా రైతులతో కలిసి వైయస్ వివేకా పులివెందుల బ్రాంచ్ కెనాల్ వద్ద ధర్నాకు దిగారు. వివేకా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జేసీ పైన వివేకానంద మండిపడ్డారు. కెనాల్కు గండి కొట్టడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. కెనాల్కు వచ్చే నీటిని చిత్రావతి నదికి మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యల్లనూరు మండల టీడీపీ నాయకుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ... గత 15 ఏళ్లుగా చిత్రావతి నది ఎడారిగా మారడంతో పలు గ్రామాలకు తాగునీరు అందడం లేదన్నారు. కెనాల్కు వెళ్లే నీటిలో అర టీఎంసీ నీటిని చిత్రావతికి మళ్లించాలని, తాము అధికారులతో చర్చించామన్నారు. చిత్రావతి నదికి నీటిని మళ్లించేందుకు గండి కొట్టినట్లు ఆయన వివరించారు.

కాగా, అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం దగ్గర పులివెందుల బ్రాంచ్ కెనాల్కు సోమవారం గండి కొట్టి, నీరు మళ్లించారు. మంగళవారం నాడు వైయస్ వివేకా ఆధ్వర్యంలో ఆందోళన నేపథ్యంలో సింగవరంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి.
కాగా, పోలీసులు వైయస్ వివేకాను అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు అనంత రైతులు సోమవారం గండి కొట్టడం, మంగళవారం కడప జిల్లా రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సింగవరంలో నిన్నటి నుండే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. మంగళవారం వివేకను అరెస్టు చేయడంతో సద్దుమణిగింది.
జేసీ సోదరుల పైన చంద్రబాబు ఆగ్రహం?
పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను సింగపూర్ నుండి రాగానే తనను కలిసి వివరణ ఇవ్వాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను జేసీ సోదరులు కొట్టి పారేస్తున్నారు. తాను ఈ విషయం టీవీలోనే చూస్తున్నానని, బాబు వివరణ కోరలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications