పులివెందుల బరిలో దస్తగిరి ! జగన్ పై పోటీకి సిద్దమని వెల్లడి...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ లో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు సీఎం జగన్ మరోసారి పులివెందుల సీటు నుంచి పోటీకి సిద్దమవుతుండగా.. ఆయనపై పోటీకి సోదరి వైఎస్ షర్మిల బరిలోకి దిగొచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పులివెందులలో వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం మధ్య గతంలో టీడీపీకి రాజీనామా చేసిన స్ధానిక నేత సతీష్ రెడ్డిని పార్టీలోకి తెచ్చుకునందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీకి పులివెందులలో కొంత మేర వ్యతిరేకత పెరగడానికి కారణమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వస్తోంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సీబీఐ విఫలమవుతున్న వేళ.. ఇందులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి వైసీపీపై విమర్శల దాడి పెంచుతున్నాడు. ఈ మధ్యే బెయిల్ పై జైలు నుంచి బయటికి వచ్చిన దస్తగిరి ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశాడు.

వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ పై పులివెందులలో పోటీకి దిగబోతున్నట్లు దస్తగిరి వెల్లడించాడు. ఏ పార్టీ నుంచో చెప్పకపోయినా వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేస్తానని, సీఎం జగన్ ను ఢీకొడతానంటూ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను భయభ్రాంతులకు గురి చేయాలని జగన్, అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వంటి వారు కుట్ర పన్నారని దస్తగిరి ఆరోపించాడు. వివేకా కేసులో నిందితులుగా ఉన్న వారిని కాపాడుతూ, తనను టార్గెట్ చేసిన సీఎం జగన్ పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు దస్తగిరి వెల్లడించాడు.












Click it and Unblock the Notifications