సాక్షాత్తు చంద్రబాబే ఇలా!.. కసి ఉంటే నాతో తేల్చుకోండి: వైఎస్ వివేకా సవాల్
దాడులను పరిశీలిస్తే.. ఉద్దేశపూర్వకంగానే సీఎం చంద్రబాబు స్వయంగా ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు అనుమానం కలుగుతోందని వివేకా అన్నారు.
కడప: ఎమ్మెల్సీ ఎన్నికల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నామినేషన్ల పర్వానికే ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటుండటం తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యంగా అధికార టీడీపీ తమపై దౌర్జన్యానికి పాల్పడుతుందంటూ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆ పార్టీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకా దీనిపై స్పందించారు. టీడీపీ నేతలకు తమ పార్టీపై అంత కసి ఉంటే తనతో గానీ, తన కుటుంబ సభ్యులతో గానీ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదని తెలుసుకోవాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పోరేటర్స్, కౌన్సిలర్స్ పై నిత్యం దాడులు జరుగుతూ వస్తున్నాయని వివేకానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ఎంతమాత్రం సహించేది లేదని, చూస్తూ ఊరుకోబోమని టీడీపీకి హెచ్చరికలు జారీ చేశారు.
దాడులను పరిశీలిస్తే.. 'ఉద్దేశపూర్వకంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు అనుమానం కలుగుతోందని' వివేకా అన్నారు. కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్న సూచనలు కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే ఎన్నికలు సవ్యంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. అధికార పార్టీ అరాచాకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.