వివేకా హత్య కేసు- ఏదోలా నన్ను అంతం చేసేందుకు కుట్ర-సీబీఐకి మరోసారి దస్తగిరి ఫిర్యాదు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరికీ దీంతో పాటే ప్రాణహానీ పెరుగుతోంది. ఈ కేసులో మిగిలిన నిందితుల గురించి సమాచారం సీబీఐకి ఇచ్చిన నాటి నుంచే దస్తగిరికి ప్రాణహాని పెరగడం మొదలైంది. అయితే తనకు భద్రత పెంచాలని పోలీసులకు, సీబీఐకి ఆయన ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి సీబీఐని దస్తగిరి ఆశ్రయించాడు.
వైఎస్సార్ జిల్లా తొండూరు పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ దస్తగిరి మరోసారి కడప ఎస్పీని కలిశాడు. తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తనతో గొడవలు పడుతూ టార్గెట్ చేస్తున్నాడని, ఏ క్షణమైనా తనను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం దస్తగిరి వెల్లడించాడు. దీంతో దస్తగిరికి ముప్పు పెరుగుతున్నట్లు అర్ధమవుతోంది.
వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నందునే తనను తప్పించేందుకు కుట్ర చేస్తున్నారని దస్తగిరి ఆరోపించాడు. ఏదో విధంగా తప్పించేందుకే పన్నాగాలు పన్నుతున్నారని తెలిపాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అన్ని విషయాలు కడప ఎస్పీకి చెప్పేందుకే వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇప్పటికే సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు ఈ విషయాలు చెప్పినట్లు దస్తగిరి వెల్లడించాడు.
వైఎస్ వివేకా హత్య జరిగిన ఏడాది వరకూ మౌనంగా ఉన్న దస్తగిరి సీబీఐ విచారణలో ఆ తర్వాత నిందితుడి నుంచి అప్రూవర్ గా మారి అన్నివివరాలు వెల్లడించాడు. మిగతా నిందితులు హత్య ఎలా చేశారో కూడా వెల్లడించాడు. దీంతో ఆయన్ను నిందితులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, భద్రత విషయంలో మాత్రం ఇంకా భయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.