జగన్ వచ్చారని మొదలెట్టాలా: కాల్వ, వైసీపీ ఆగ్రహం
హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు బుధవారం ఏపీ శాసన సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు. రాజధాని నిర్మాణం, భూసమీకరణపై చర్చించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది.
దీనిపై కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ.. ప్రతిపక్ష సభ్యులు సభా సమయం వృథా చేయడం మంచిది కాదన్నారు. రాజధాని భూములకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ప్రతిపక్ష సభ్యులు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఓ పిట్టకథ చెప్పారు. పల్లెటూళ్లలో నాటకాలు వేస్తూ ఉంటారని, ఒక అంకం పూర్తవుతుందని, ఊరి పెద్ద వచ్చాడని మళ్లీ మొదటి నుంచి వేయమంటారని, ఇప్పుడు జగన్ వచ్చారని మళ్లీ మొదటి నుంచి చర్చించమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

చర్చ జరిగితే వాస్తవాలు తెలుస్తాయ్: జగన్
శాసన సభలో రాజధాని పైన చర్చ జరిగితే వాస్తవాలు తెలుస్తాయని వైయస్ జగన్ అన్నారు. భూసమీకరణ పేరుతో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్నారు. రాజధాని భూముల పైన చర్చ జరగాలన్నారు. రైతు, కూలీల సమస్యల పైన సభలో చర్చ జరగడం లేదన్నారు. రాజధానిపై చర్చకు సమయం ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు.
జగన్కు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదని, ఎన్నో అంశాల పైన చర్చ జరగాల్సి ఉందని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రతిపక్షానికి చర్చ జరగడం ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల ఘాటుగా స్పందించారు. నరేంద్ర తమకు మపాఠాలు చెప్పవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
కాల్వపై ప్రివిలేజ్ మోషన్
ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. మరోవైపు, తొమ్మిది మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనిత సభాపతి కోడెలను కోరారు. స్పీకర్ స్థానాన్ని కించపరిచాలని తొమ్మిది మందిపై సభా హక్కుల నోటీసు ఇచ్చారు.












Click it and Unblock the Notifications