సొంత జిల్లాలో జగన్కు షాక్: లోకేష్ భరోసా, టిడిపిలోకి కార్పోరేటర్లు
కడప: సొంత జిల్లా కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. కడప నగరపాలక సంస్థ కార్పోరేటర్లు ఎనిమిది మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారంనాడు వారు టిడిపిలో చేరారు.
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీని వాసరెడ్డి నేతృత్వంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో వారు పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుమారు గంటన్నర పాటు వారితో సమావేశమయ్యారు. కడప అభివృద్ధికి ముఖ్యమంత్రితో పాటు లోకేష్ కూడా భరోసా ఇవ్వడంతో వారు పార్టీ మారినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా పకడ్బందీగా తెలుగు దేశం నేతలు వైసీపీ కార్పొరేటర్లను పార్టీలో చేర్చు కునేందుకు పావులు కదిపారు.
పార్టీలో చేరేందుకు మూడు రోజుల ముందే వీరు కడపలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీని వాసరెడ్డితో సమా వేశమయ్యారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, కార్పొరేటర్లు రాజ గోపాల్రెడ్డి, ఆసం వరలక్ష్మీ, పీటర్లతో కలిసి నలుగురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. తాజాగా మరో 8 మంది చేరడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నగర పాలక సంస్థలో పెద్ద దెబ్బ తగిలింది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారిలో 47వ డివిజన్ సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్తో పాటు 1వ డివిజన కార్పొరేటర్ చైతన్య, 8వ డివిజన్ కార్పొరేటర్ జిమ్మిరెడ్డి, 20వడివిజన కార్పొరేటర్ ఒ.లక్ష్మీదేవి, 31వ డివిజన్ కార్పొరేటర్ ఎంఎల్ఎన్ సురేష్బాబు, 35వ డివిజన కార్పొరేటర్ షంషీర్, 40వ డివిజన కార్పొరేటర్ విజయరాణిలతో పాటు 39వ డివిజన కార్పొరేటర్ సాదిక్ ఉన్నిసా బేగం అల్లుడు, ఆ డివిజన ఇన్ఛార్జి మున్నా ఉన్నారు.
50 మంది కార్పొరేటర్లు వున్న కడప కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ బలం 20కి చేరింది. ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే గెలుచుకొన్న టీడీపీ కొద్దికాలం క్రితం నలుగురు వైసీపీ కార్పొరేటర్లను, ఇప్పుడు తాజాగా 8 మంది కార్పొరేటర్లను చేర్చుకుంది. మరో 8 మందిపై కూడా టిడిపి గురి పెట్టినట్లు సమాచారం.