కళ్లలో కారం కొట్టి జగన్ పార్టీ నేతను నరికి చంపారు
స్థానిక జయప్రకాష్ నగర్లో నివాసం ఉండే శివరామకృష్ణకు బోస్ రోడ్డులో సెల్ఫోన్ షాపు వుంది. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆశీస్సులతో ఎదుగుతున్న శివరామకృష్ణ వైయస్సార్ కాంగ్రెసులో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ఈయనపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులున్నాయి. పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. కొందరితో పాతకక్షలు కూడా ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
హత్య గురించి తెలియగానే డిఎస్పీ టిపి విఠలేశ్వర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. టూటౌన్ సిఐ లక్ష్మయ్య సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. బస్టాండ్ సెంటర్లోని ఓ సెలూన్లో నుంచి బయటకు వస్తున్న శివరామకృష్ణపై నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు చెబుతున్నారు.
ఆటోలో వచ్చి వారు శివరామ కళ్లల్లో కారం చల్లి వేటకొడవళ్లతో నరికారు. హత్యకు కారణాలు దర్యాప్తులో తేలాల్సి వుందని డిఎస్పీ విఠలేశ్వర్ వివరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.