జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న వ్యక్తికి రాజ్యసభ సీటా?
అమరావతి: అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక సీటు వైసీపీకి వచ్చే అవకాశం ఉండటంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు కేటాయించడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
"జగన్ అక్రమాస్తుల కేసులలో సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో కూడా ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి వంటి ఒక ఆర్ధిక నేరస్థుడుని వైసీపీ తరపున రాజ్యసభకి పంపించడం చాలా శోచనీయం. వైసీపీలో అగ్రవర్ణాలకి చెందిన వ్యక్తులకి మాత్రమే అధికారం, పదవులు ఇస్తారని జగన్ మరోసారి నిరూపించారు. ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అగ్రవర్ణాల నేతలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్దతి అనుసరిస్తున్నారు. అందుకే వైసీపీలో నిరాదరణకి గురవుతున్న మిగిలిన కులాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ వంటివారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న టీడీపీలోకి తరలివస్తున్నారు," అని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు.
విజయసాయి రెడ్డిని గురువారం ఉదయం వైసీపీ అధినేత వైయస్ జగన్ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత పలువురు రాజకీయ విశ్లేషకులు జగన్ తీరుని తప్పుబట్టారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలంటే కేవలం తమ సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కూడా ఆదరించాల్సి ఉందన్నారు.
కానీ జగన్ అలా కాకుండా కేవలం తన సామాజిక వర్గానికి చెందిన నేతలకే పదవులను కేటాయిస్తున్నారని, మిగిలిన వారిని ఆదరించడం లేదనే వాదన వినిపిస్తోంది. తన కులానికే ప్రాధాన్యతనిస్తే వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ అధికారంలోకి రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయసాయి రెడ్డిని వైసీపీ తరుపున రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసుల గురుంచి ప్రస్తావించడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో ఆయనపై ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన లొంగిపోకుండా నిజాయితీగా నిలబడ్డారని అందుకే ఆయనకి సీటు కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జగన్ను ఇరకాలంటో పడేశాయి. 'ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా నిలబడటం' అంటే అప్రూవర్గా మారకుండా ఉండటమేనేమో? జగన్ ఆ విధంగా మాట్లాడటం కూడా పలు విమర్శలకు తావిస్తోంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు ఎంత ఒత్తిడి చేసినా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉన్నందుకే ఆయనకి పార్టీలో ఉన్నత పదవి, ఇప్పుడు రాజ్యసభ సీటు కేటాయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.