చంద్రబాబుపై ఫిర్యాదుల వెల్లువ: మోసగాడంటూ రోజా, భూమన ఫైర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి, ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అంతేగాక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబునాయుడపై పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేశారు.
తెలగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోన్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే మండిపడ్డారు. బుధవారం నియోజకవర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ అక్కడి పోలీస్స్టేషన్లో రోజా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పాలన అంతా పూర్తి నిర్లక్ష్య ధోరణితో కొనసాగుతోందని ఆమె దుయ్యబట్టారు.
మరోవైపు తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు పాలనపై ఫిర్యాదు చేశారు. ప్రజలను దారుణంగా మోసగిస్తోన్న చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ ఆయన పోలీసులని కోరారు. కాగా, మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, బంగారు పాల్యెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ చంద్రబాబు పాలనపై పోలీస్ట్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల రాష్ట్రపాలనపై నిన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం మరో వైసీపీ నేత చంద్రబాబు పాలనపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
పాలనలో రెండేళ్లు గడిచినా చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి బుధవారం కడపలోని పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలువురు కార్యకర్తలతో పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆయన పోలీసులకి తమ ఫిర్యాదు లేఖను అందించారు.
ఎన్నో హామీలు గుప్పించి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆయన తెలిపారు. చంద్రబాబుని అరెస్టు చేయాలని ఆయన పోలీసులని కోరారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతూరు పులివెందులలో ఆయన బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిల నేతృత్వంలో భారీ ర్యాలీ జరగింది. ర్యాలీకి ముందుగానే పోలీస్ స్టేషన్ చేరుకున్న వివేకా, అవినాశ్ లు... చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.