వైయస్ జగన్కు ఎదురు దెబ్బ: ఓ ఎమ్మెల్సీ కట్
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు ఓ ఎమ్మెల్సీ సీటును కోల్పోతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రధాని ఎన్నికల అధికారి నోటిఫై చేశారు.
అయితే, ఆశ్చర్యకరంగా ఎన్నికల కమిషన్ ఒక్క ఎమ్మెల్సీ సీటుకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మరో సీటు ఖాళీ ఉందనే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి సిఇసికి గుర్తు చేశారు. అయితే, రెండో సీటుకు ఉప ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు.
రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటా కింద 17 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. అయితే, ఎపి శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద 16 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. రెండు సీట్లకు సిఇసి ఉప ఎన్నికలు నిర్వహించి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు ఓ సీటును దక్కించుకుని ఉండేది.
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఒక్క ఎమ్మెల్సీ సీటును అధికార తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. ఆ సీటును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.