భేతాళ మాంత్రికుడి సినిమా: బడ్జెట్పై చెవిరెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన బడ్జెట్ భేతాల మాంత్రికుడి సినిమాలా ఉందని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. యనమల రామకృష్ణుడి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
బడ్జెట్లో ఏ రంగానికి కూడా ప్రాధాన్యం లేదని, పైగా అత్యంత ముఖ్యమైన రాజధాని నిర్మాణాన్ని అసలు బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రానికి మౌలిక వసతులు చాలా ముఖ్యమని, ఇక్కడ కొత్తగా ఫ్లైఓవర్లు, భవనాలు రావాల్సి ఉందని, అయితే ఈ రంగానికి కేటాయించిన మొత్తం తూతూ మంత్రంగానే ఉందని అన్నారు.
ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఊహాజనిత బడ్జెట్లు ప్రవేశపెట్టలేదని, ఇప్పుడే తాము తొలిసారి ఊహాజనిత కేటాయింపులూ ఉహాజనిత బడ్జెట్ చూస్తున్నామని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, తీరా దాని విషయాన్ని సరిగా ప్రస్తావించలేదని అన్నరాు.
ముస్లింలకు, యువతకు చేసిన కేటాయింపులు కూడా నామమాత్రంగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఏ రంగానికీ మేలు చేసే విధంగా బడ్జెట్ లేదని, అసలు ప్రభుత్వానికి స్పష్టతే లేనప్పుడు ప్రజలకు ఏమిస్తారని అన్నారు. ఈ ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందో, వెనక్కి లాక్కెళ్తుందో తెలియడం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.