కొత్తపల్లి గీతపై ఎమ్మెల్యే నిప్పులు, గీత కారులో బుట్టా...
విశాఖ/కరీంనగర్: తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్న అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత, పాడేరు శాసన సభ్యురాలు ఈశ్వరి బుధవారం మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొత్తపల్లి గీత తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉందని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల పైన ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారని చెప్పారు. కొత్తపల్లి గీతకు మొదటి నుండి పార్టీలో ప్రత్యేక స్థానం కల్పించి, లోకసభ టిక్కెట్ ఇచ్చారన్నారు.

టిక్కెట్ ఇచ్చి, గెలిపించిన పార్టీ పైననే ఆమె తప్పుడు విమర్శలు చేయడం ఏమాత్రం తగదన్నారు. గిరిజన ఎమ్మెల్యేలు అందరు కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలో ఇమడలేక పోతే పదవులకు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవాలన్నారు. అంతేకాని, అసత్య ప్రచారాలు చేస్తే గిరిజనులు క్షమించరని కొత్తపల్లి గీతను ఈశ్వరి హెచ్చరించారు.
కొత్తపల్లి గీత కారును ఢీకొన్న క్యాబ్
ఎంపీ కొత్తపల్లి గీత కారును ఓ క్యాబ్ ఢీకొట్టింది. గీత కారులోనే మరో ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎంపీలెవరికీ గాయాలు కాలేదు. కారు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది.
కేసీఆర్పై జీవన్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జీవన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పైన మండిపడ్డారు. రుణమాఫీ, రీషెడ్యూల్ విషయంలో ఆర్బీఐని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను ఒప్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రైతులకు ఏడు గంటల విద్యత్ ఇవ్వాలన్నారు. రుణమాఫీ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రెండు నెలలు అయినా ఇంకా అమలు కాలేదన్నారు.












Click it and Unblock the Notifications