టిడిపి నేత హత్య: పరారీలో జగన్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి?
గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో పరారయ్యారని తెలుస్తోంది.
గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో పరారయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఆయనతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన వెల్దుర్తి మండలం కండ్లకుంటలో తాడిపర్తి పాపిరెడ్డి అనే టిడిపి స్థానిక నేతను వైసిపికి చెందిన కొందరు కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్య చేశారు.
నిందితులిచ్చిన సమాచారంతో..
ఈ కేసులో పిన్నెల్లి హనిమి రెడ్డి, వెంకట రెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణ రెడ్డిలు ప్రధాన నిందితులు. జెండా పెంట కృష్ణానది రేవు వద్ద నిందితుల్లో కొంతమంది ఉన్నారన్న సమాచారంతో మంగళవారం వారిని అరెస్ట్ చేసి, హత్యకు వినియోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వారు ఇచ్చిన సమాచారంతో పలువురు వైసిపి నేతలపై కేసులు పెట్టారు. ఈ కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి సహా పలువురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ కే నాగేశ్వరరావు వెల్లడించారు.
2014లో గ్రూపులుగా చీలింది
2014 సార్వత్రిక ఎన్నికల్లో కండ్లకుంట రెండు వర్గాలుగా చీలింది. ఈ ఏడాది గ్రామంలో గ్రామ కాయిదా పాటల విషయంలోను, నీటిని సరఫరా చేసే బోరు విషయంలోను రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి.
ఈ క్రమంలో ఈ నెల 17న సత్రం సెంటర్ వద్దకు టీ తాగేందుకు పాపిరెడ్డి రాగా పిన్నెల్లి హనిమి రెడ్డి, వెంకట రెడ్డి, లక్ష్మారెడ్డి నారాయణ రెడ్డి తదితరులు విచక్షణారహితంగా దాడి చేశారు.
మెరుగైన చికిత్స కోసం తరలించగా..
మెరుగైన చికిత్స కోసం నరసారావుపేటకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల్లో పదిమంది వెల్దుర్తి మండలంలోని జెండాపెంట కృష్ణానది రేవు వద్ద ఉన్నారని సమాచారం ప్రకారం వారిని అరెస్టు చేశారు.
గాలిస్తున్న బృందాలు
హత్య కేసులో భాగస్వాములైన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట్రామి రెడ్డి, హినిమి రెడ్డిలను అరెస్టు చేయాల్సి ఉందని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డిఎస్పీ తెలిపారని వార్తలు వస్తున్నాయి.