నిరంకుశత్వం: సభ నుంచి జగన్ వాకౌట్, తగదన్న యనమల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం జరిగిన ఏపి శాసనసభలో వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఐకెపి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నామని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యానిమేటర్ల అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. బాబు వచ్చారు.. జాబులు ఊడబీకారు అని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా శాసనసభ నుంచి తమ పార్టీ వాకౌట్ చేస్తోందని తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రెచ్చగొట్టే విధానం సరికాదని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడకుండా ఆందోళన చేయడం తగదని అన్నారు. నిరుద్యోగ భృతి అంశంపై ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చిస్తున్నామని చెప్పారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తోందని తెలిపారు.
రాజధాని ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని యనమల అన్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత దానిపై చర్చిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారని తెలిపారు.
కాగా, నాల్గవ రోజైన సోమవారం నాటి సభలో కాసేపట్లో ఏపి సిఎం చంద్రబాబునాయుడు రుణమాఫీపై ప్రకటన చేయనునున్నారు. సిఆర్డీఏ, వ్యాట్, విద్య చట్టసవరణ బిల్లులపై చర్చ జరగనుంది. మండలిలో సిఆర్డీఏ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.