'నంద్యాల' ఆవేశం.. జగన్ సెల్ఫ్గోల్: అదే వైసిపికి మైనస్, 'కొత్త' వాదన గెలిచేనా?
నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వైసిపి సెల్ఫ్ గోల్ చేసుకుందా? స్వయంగా జగన్ మాట్లాడిన మాటలు, పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వైసిపి సెల్ఫ్ గోల్ చేసుకుందా? స్వయంగా జగన్ మాట్లాడిన మాటలు, పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
నంద్యాలలో టిడిపికి ఆందోళనలివే, జగన్ వస్తే మంచిదే! అఖిలప్రియకు ఆదేశాలు
జగన్ వ్యాఖ్యలపై ప్రధానంగా టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలు మాత్రం అంతకంటే దారుణంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. స్క్రూటినీ సమయంలోను రెండు గంటల పాటు ఉత్కంఠ రేపారు.
ఒత్తిడితో పై చేయి కోసం ప్రయత్నం
నంద్యాల ఉప ఎన్నికలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నంద్యాల గెలుపు టిడిపి, వైసిపిలకు ప్రతిష్టాత్మకం. వైసిపి, టిడిపిలు గెలుపు కోసం మాటల యుద్ధం, ఓటర్లుకు గాలం వేస్తుండటమే కాకుండా ఒత్తిడితో ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Recommended Video
వైసిపి సెల్ఫ్ గోల్
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి సెల్ఫ్ గోల్ చేసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు, శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన మగవాళ్లమా, ఆడవాళ్లమా అనే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత వారం రోజులుగా జగన్ చేసిన వ్యాఖ్యల పైనే చర్చ సాగుతోంది.
అది వైసిపికి మైనస్
జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. ఈసీ కూడా ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు ఇది వైసిపికి పెద్ద మైనస్ అంటున్నారు.
ఆ ఆవేశంలోనే.. అలవాటులో పొరపాటు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక నాయకులు కొంత సంయమనంతో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతి బహిరంగ సభలో, ప్రతి కార్యక్రమంలో చంద్రబాబును తిట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. హోదా విషయంలోను బిజెపి కంటే చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అవకాశం వచ్చినప్పడుల్లా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడతారు. అందులో భాగంగానే అదే అలవాటులో భాగంగా జగన్ నంద్యాలలోను నోరు జారారని అంటున్నారు.
ఇరువురి వ్యాఖ్యలు ఘాటుగానే
టిడిపి నేతలు ప్రధానంగా జగన్ వ్యాఖ్యలను టార్గెట్ చేసుకున్నారు. అడపాదడపా శిల్పా చక్రపాణి రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ స్థానికంగా మాత్రం చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలు ఎక్కువ దుమారం రేపుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
బ్రహ్మానంద రెడ్డిని ఇలా టార్గెట్, అందుకే శిల్పాకు ఓటేయండి
భూమా బ్రహ్మానంద రెడ్డిని వైసిపి నేతలు టార్గెట్ చేసే తీరు కూడా ఎవరికీ రుచించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అఖిలప్రియ, బ్రహ్మానంద రెడ్డిలు రాజకీయాలకు కొత్త అని, వారు రాజకీయాల్లో పిల్లలు అని, వారికి అనుభవం లేదని కాబట్టి శిల్పా మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని వైసిపి చెబుతోంది.
టిడిపి ఘాటు కౌంటర్
భూమా బ్రహ్మానంద రెడ్డిపై వైసిపి ప్రచారానికి టిడిపి కూడా ధీటుగానే స్పందిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్లు రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసినప్పుడు వారికి ఏం అనుభవం ఉందని, కొత్తగా అంటే అనుభవం ఉండదనే అర్థమని టిడిపి నేతలు చెబుతున్నారు. భూమా వయస్సులో చిన్న అనే వ్యాఖ్యలకు.. వైయస్, జగన్లు కూడా చిన్న వయస్సులోనే వచ్చారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, అఖిలప్రియకు టిక్కెట్ ఇచ్చిందే వైసిపి అని అంటున్నారు. స్వయంగా అఖిల కూడా ఇదే చెప్పారు.
2014లో టిడిపి మాటేమిటి?
2014లోను టిడిపి ఇదే తరహా ప్రచారం చేసిందని వైసిపి కూడా గుర్తు చేస్తోంది. చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టి నవ్యాంధ్రకు ఆయన అవసరమని టిడిపి చెప్పిందని అంటున్నారు. అయితే, పరిపాలనకు, దీనికి తేడా ఉందనేది ఇంకొందరి వాదన.