టార్గెట్-50: జగన్ మాస్టర్ ప్లాన్.. లిస్ట్, రూట్ మ్యాప్ సిద్దం, టీడీపీ కంచుకోటలకు ఎర్త్?
ఇందుకోసం ఇప్పటికే ఆయా సెగ్మెంట్ల జాబితా కూడా రెడీ అయిపోయిందని చెబుతున్నారు.
Recommended Video

విజయవాడ: నంద్యాల ఉపఎన్నిక ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చి ఉంటే భవిష్యత్తుపై వారిలో ధీమా పెరిగి ఉండేది. కానీ ఫలితం తారుమారు కావడంతో పార్టీ శ్రేణులంతా ఒకింత నిరుత్సాహంలో, ఆత్మన్యూనతలో పడిపోయిన పరిస్థితి. నేతలు, కార్యకర్తల మూడ్ను త్వరగా మార్చకపోతే వారంతా అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది.
ఈ నేపథ్యంలోనే జగన్ తన పాదయాత్రతో అన్ని బలహీనతలను అధిగమించాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీడీపీ కంచుకోటల్లో ఎలా పాగా వేయాలన్న దానిపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారట. ఇందుకోసం పాదయాత్రను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఏంటా ప్లాన్?:
పాదయాత్ర సందర్భంగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న 50సెగ్మెంట్లలో పర్యటించాలని జగన్ భావిస్తున్నారట. తద్వారా వైసీపీ ప్రభావాన్ని ఆ నియోజకవర్గాల్లో విస్తరించాలనేది ఆయన ప్లాన్. ఇందుకోసం ఇప్పటికే ఆయా సెగ్మెంట్ల జాబితా కూడా రెడీ అయిపోయిందని చెబుతున్నారు.

జాబితాలో ఉన్నవేవి:
టీడీపీకి కంచుకోటగా ఉన్న 50సెగ్మెంట్ల వివరాలను జగన్ తెప్పించుకున్నారట. ఇందులో 7సార్లు టీడీపీ గెలిచిన 16అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలతో పాటు, ఆరుసార్లు గెలిచిన 28అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలు ఉన్నాయట. ఇందులో హిందూపురం, కుప్పం నియోజకవర్గాలను మినహాయించి తెలుగుదేశం-వైసీపీ సమవుజ్జీలుగా ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల వివరాలు కూడా తెప్పించుకున్నారట.

బలాలు-బలహీనతలపై ఫోకస్:
జగన్ ఎంచుకున్న 50సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయంగా పావులు కదపనున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ను ఈ 50సెగ్మెంట్ల మీదుగా సిద్దం చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా.. ఆయా సెగ్మెంట్లలోని వైసీపీ నేతలను జగన్ నేరుగా కలుస్తారు.
క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై వారితో చర్చిస్తారు. అదే సమయంలో ప్రత్యర్థుల బలహీనతలను తెలుసుకునేందుకు తెర వెనుక ప్రశాంత్ కిశోర్ ఎలాగు ఉన్నారు. కాబట్టి పక్కా పకడ్బందీ ప్రణాళికతో టీడీపీ కంచుకోటల్లో పార్టీని విస్తరించాలని జగన్ భావిస్తున్నారు.

ద్వితీయ స్థాయి నేతలతోను:
ఎంపిక చేసిన 50అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్ర సందర్భంగా.. ద్వితీయ శ్రేణి పార్టీ నాయకులతోను జగన్ పలు అంశాలపై చర్చించనున్నారు. కేవలం ఇన్ చార్జీలను మాత్రమే నమ్మకుండా.. ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే వాస్తవ పరిస్థితులను అంచనా వేయవచ్చుననేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.
అవసరమైతే ద్వితీయ శ్రేణి నేతల్లో బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని ఆయన ప్రోత్సహించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద టీడీపీ కంచుకోటల్లో వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నారని స్పష్టమవుతోంది. పాదయాత్రతో ఆ కోరిక ఏమేరకు సఫలమవుతుందో భవిష్యత్తులో తేలనుంది.












Click it and Unblock the Notifications