తెలంగాణ ఎఫెక్ట్: జగన్కు మజ్లిస్ 'విస్తరణ' ఝలక్
హైదరాబాద్/నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మజ్లిస్ పార్టీతో నష్టం జరుగుతుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్ సమైక్యవాదం వినిపిస్తుండటంతో ఆ పార్టీ ఇప్పటికే తెలంగాణలో బాగా దెబ్బతిన్నది. ఇతర పార్టీలైతే ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగైందని అంటున్నారు. అయితే, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ వంటి కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఇప్పటికీ కొంత ప్రభావం చూపుతోందట. 2014 ఎన్నికల కోసం తెలంగాణ ప్రాంతంలోను పలు జిల్లాల నుండి కూడా టిక్కెట్ల కోసం పోటాపోటీగా ఉందంటున్నారు.
అల్పసంఖ్యాక వర్గాలు ఎక్కువగా ఉన్నచోట, వైయస్ అభిమానులు ఉన్నచోట జగన్ పార్టీ కొంత బలంగా ఉందనే వాదనలు ఉన్నాయి. అయితే మజ్లిస్ పార్టీ విస్తరణ ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయంటున్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న పార్టీలో వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు ఉన్నాయి. జగన్ పార్టీ సమైక్యం తప్ప మరొకటి అంగీకరించేది లేదంటోంది. మజ్లిస్ మాత్రం మొదట సమైక్యం లేదా రాయల తెలంగాణ అని చెప్పినప్పటికీ తెలంగాణకు కేంద్రం మొగ్గు చూపాక త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలనికోరుతోంది.

2014 ఎన్నికలలోగా కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఇప్పటి దాకా హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరింప చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా కొంతకాలంగా మైనార్టీలు ఎక్కువగా ఉండే అనంతపురం, కర్నూలు, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ అగ్రనేతలు పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.
జగన్.. పార్టీ స్థాపించాక తెలంగాణలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరారు. జగన్ సమైక్యవాదం వినిపిస్తుండటంతో చాలామంది.. ముఖ్యంగా ఆ పార్టీలోని మైనార్టీలు మజ్లిస్ వైపు చూస్తున్నారంటున్నారు. జగన్ యూ టర్న్ తీసుకోవడం, మజ్లిస్ పార్టీని విస్తరింప చేయాలనుకోవడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టాన్ని కలిగించే అంశమే అంటున్నారు. తెలంగాణలో బిజెపిని ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా మజ్లిస్ పార్టీ ఎక్కువ చోట్ల పోటీకి సిద్ధమవుతోంది. టిడిపి అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ టిడిపి క్యాడర్ తెరాస, బిజెపిల వైపు చూస్తోంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చినందువల్ల ఆ పార్టీకి వచ్చే నష్టమేమీలేదు.
జగన్ సమైక్యమంటుండటంతో ఆ పార్టీలోని తెలంగాణవాదులు లేదా ఆ పార్టీలో ఉంటే తెలంగాణలో గెలుపు అవకాశం లేదని భావించే వారు మజ్లిస్ వైపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మజ్లిస్ పార్టీని అనంతపురం, కర్నూలు వంటి సీమాంధ్ర జిల్లాల్లోను విస్తరింప చేయాలని అసదుద్దీన్ భావిస్తున్నారు.
ఆ రెండు జిల్లాల్లో మైనార్టీలు అధికంగా ఉన్నందువల్లే మజ్లిస్ రాయల తెలంగాణ కోసం పట్టుబడింది. ఆ రెండు జిల్లాలు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్రలో ఉన్నప్పటికీ పోటీ చేయాలనే ఆలోచనలో మజ్లిస్ ఉందట. అదే జరిగితే అక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
మజ్లిస్లోకి జగన్ పార్టీ కార్యకర్తలు
కాగా నిజామాబాద్ జిల్లాలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆదివారం మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications