శిల్పాXమధు.. నువ్వంటే నువ్వు: చిన్న గొడవే కానీ, రోజా ఆగ్రహం (వీడియో)!
నంద్యాల ఉప ఎన్నికలకు మరుసటి రోజే పట్టణంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్న విషయాన్ని ఇరువురు నేతలు పెద్దదిగా చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలకు మరుసటి రోజే పట్టణంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్న విషయాన్ని ఇరువురు నేతలు పెద్దదిగా చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు.
నంద్యాలలో కలకలం: టిడిపి నేత గన్మెన్ కాల్పులు, శిల్పాపై హత్యాయత్నమని..
నంద్యాలలో బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. వీటిని టిడిపి, వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 28న ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది.
చిన్న గొడవనే పెద్దదిగా చేసుకున్నారు
ఈ నేపథ్యంలో గురువారం గొడవ జరిగింది. ఫలితాలకు 3రోజుల ముందు ఇలా జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, వైసిపి శిల్పా చక్రపాణి రెడ్డి, టిడిపి అభిరుచి మధులు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకున్నారని చెబుతున్నారు.
ఇదీ అసలు విషయం!
మైనార్టీ నేత మృతి చెందడంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు టిడిపి నేత అభిరుచి మధు, వైసిపి నేత శిల్పా చక్రపాణి రెడ్డిలు వెళ్లారు. అభిరుచి మధు వాహనం అడ్డంగా ఉంది. దానిని తొలగించమని వైసిపి నేతలు చెప్పారు. దీనికి మధు నిరాకరించారు. ఆ సమయంలో శిల్పా - మధుల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు వైసిపి వాళ్లు మధు కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో మధు అక్కడే ఉన్న కొబ్బరిబొండాం కత్తిని చేత్తో పట్టుకొని బెదిరించారు. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.
ఎవరు వాహనం తీసినా గొడవ జరిగి ఉండకపోయేది
ఆ సమయంలో ఇటు శిల్పా లేదా అటు మధు ఎవరు వాహనం తీసినా గొడవ జరిగి ఉండకపోయేదని అంటున్నారు. మధు కనుక తన వాహనాన్ని అడ్డు లేకుండా తీస్తే అసలు ఈ గొడవే వచ్చి ఉండేది కాదని అంటున్నారు. ఆయన నిరాకరించడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు.
నువ్వు వెనక్కి వెళ్లమంటే నువ్వని... డిఎస్పీ, టూటౌన్ సిఐ ఇలా
నంద్యాల ఘటనపై డిఎస్పీ మురళి స్పందించారు. నంద్యాలలో ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. కారు తీసే విషయంలో గొడవ జరిగిందన్నారు. ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటనే అన్నారు. టూటౌన్ సీఐ మాట్లాడుతూ.. చిన్న విషయంలో గొడవ వచ్చిందన్నారు. నువ్వు వెనక్కి వెళ్లమంటే.. నువ్వు వెళ్లమని ఇటు శిల్పా, అటు మధులు గొడవ పడ్డారన్నారు.
శిల్పా సోదరులపై కేసు
తనపై హత్యాయత్నం చేశారని అభిరుచి మధు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు శిల్పా సోదరులపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, బెదిరింపు కేసు నమోదు చేశారు. ప్రతిగా వైసిపి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది.
టిడిపి రౌడీయిజం అంటూ రోజా వీడియోతో ఆగ్రహం
నంద్యాలలోని ఉద్రిక్త పరిస్థితిపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా తన ఫేస్బుక్ అకౌంటులో ఓ వీడియో పోస్ట్ చేసారు. 'నంద్యాలలో టీడీపీ రౌడీయిజం వైసిపి నేత శిల్పా చక్రపాణి రెడ్డిపై భూమా వర్గీయుడు అభిరుచి మధు హత్యాయత్నం' అని పేర్కొంటూ మధు కత్తి పట్టుకున్న వీడియో పెట్టారు.