ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే..
ఈ నెల 26న రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్ధుల పేర్లను సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు విధేయతే ప్రామాణికంగా ఈ ఎంపికలు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి ఈసారి ఖాళీ అయ్యే నాలుగు సీట్లు వైసీపీకే ఏకగ్రీవంగా దక్కనున్నాయి.
రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
ఏపీలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్దానాలకు వైసీపీ తరఫున పోటీ చేసే నాలుగు అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారు. వీరిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, పారిశ్రామికవేత్తలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఉన్నారు. వీరి అభ్యర్ధిత్వాలను సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేసేశారని వైసీపీలో విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
రాజ్యసభకు వీరికే ఎందుకు అవకాశం
రాజ్యసభలో ఏపీ నుంచి ఈసారి ఖాళీ అవుతున్న నాలుగు స్ధానాలకు పోటీ చేస్తారని భావిస్తున్న నలుగురిలో ముగ్గురు వైసీపీ నుంచి మరొకరు బీజేపీ కోటాలో ముకేష్ అంబానీ ఆశీస్సులున్న ఎంపీ పరిమళ్ నత్వానీ. వైసీపీ నుంచి అభ్యర్ధులుగా చెబుతున్న అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు ఓసీ, ఎస్సీ కోటాలో రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ జగన్ గతంలో రాజ్యసభ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి గత ఎన్నికల్లో నరసరావుపేట స్ధానాన్ని మరో నేత లావు కృష్ణదేవరాయల కోసం, పండుల రవీంద్ర బాబు తన సిట్టింగ్ స్దానాన్ని చింతా అనురాధ కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు వీరికి అవకాశం దక్కనుంది.
మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవికి
శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన నేపథ్యంలో కేంద్రం ఏ క్షణంలోనైనా పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లు పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీ శాసనమండలి రద్దవుతుంది. దీంతో మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవులు కోల్పోతారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో ఓటమి పాలైనా విధేయత కోణంలో జగన్ వీరిద్దరికీ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. పిల్లి అప్పటికే ఎమ్మెల్సీగా ఉండగా.. మోపిదేవి మంత్రి అయ్యాక ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే మండలి రద్దు నేపథ్యంలో పదవులు కోల్పోయే అవకాశం ఉన్నందున వీరిలో మోపిదేవికి ఈసారి రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నారు. అయితే మోపిదేవి ఆరోగ్య కారణాల రీత్యా ఢిల్లీకి వెళ్లే ఆసక్తి లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పు చేయాల్సి వస్తే ఆయన స్దానంలో నెల్లూరు జిల్లాలో తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సాయిరెడ్డి సన్నిహితుడు బీద మస్తాన్ రావుకు అవకాశం దక్కవచ్చు. మరో మంత్రి పిల్లికి మాత్రం రాజ్యసభకు భవిష్యత్తులో అవకాశం కల్పించవచ్చు.
పరిమళ్ నత్వానీకి ఖాయమే
వైసీపీ రాజ్యసభ అభ్యర్ధిత్వాల్లో అసాధారణంగా తెరపైకి వచ్చిన నేత పరిమళ్ నత్వానీ. బీజేపీ కోటాలో ఒకరికి ఈసారి అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ ను కోరిన నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా పరిమళ్ ను వెంటబెట్టుకుని వచ్చి జగన్ ను కలిశారు. అప్పుడే పరిమళ్ అభ్యర్ధిత్వం ఖరారైపోయింది. అయితే అభ్యర్ధిత్వం ఖరారు విషయంలో తనకు మూడు రోజుల సమయం ఇవ్వాలని జగన్ కోరినట్లు పరిమళ్ ఈ మధ్య ఢిల్లీలో మీడియాకు చెప్పారు. అయితే అంబానీ కోరిన తర్వాత జగన్ కాదనేది ఏముంటుంది. అందుకే బీజేపీ ప్లస్ అంబానీ కోటాలో వైసీపీ సభ్యుల మద్దతుతో పరిమళ్ ఈసారి రాజ్యసభకు వెళ్లడం ఖాయమైపోయింది.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 151 సభ్యుల బలంతో పటిష్టంగా కనిపిస్తున్న వైసీపీ రాజ్యసభకు ఖాళీ అయ్యే నలుగురు సభ్యులను సునాయాసంగా గెలిపించుకునే అవకాశం ఉంది.