ఆత్మకూరులో వైసీపీ భారీ విజయం - విక్రమ్ రెడ్డి ఏకపక్షంగా : 82,888 ఓట్ల మెజార్టీతో..!!
ఆత్మకూరు మరోసారి వైసీపీ ఖాతాలో చేరింది. మేకపాటి వారసుడికే ఆత్మకూరు ఓటర్లు పట్టం కట్టారు. 82,742 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ గెలుపు వైసీపీకి కొత్త జోష్ తెచ్చింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. గౌతమ్ రెడ్డి సోదరుడు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి రౌండ్ నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కేవలం ఏడో రౌండ్ లో మాత్రమే బీజేపీ అభ్యర్ధి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించారు. మొత్తం 20 రౌండ్లలోనూ తొలి రౌండ్ నుంచే విక్రమ్ రెడ్డి ఆధిపత్యం కొనసాగింది.

మేకపాటి ఏకపక్ష విజయం
వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టీడీపీ - జనసేన ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. తొలి రౌండ్ లో 5 వేల మెజార్టీ సాధించిన విక్రమ్ రెడ్డి ఏ రౌండ్ లోనూ వెనక్కు తగ్గలేదు. ప్రతీ రౌండ్ కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. 12 వ రౌండ్ ముగిసే సరికి 50 వేల మెజార్టీని దాటేసారు. ఇక, ఏకపక్షంగా వస్తున్న ఫలితాలు చూసిన బీజేపీ అభ్యర్ధి ఏడో రౌండ్ లెక్కింపు తరువాత కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్ది నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి సాధించిన మెజార్టీ కంటే ఇప్పుడు విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీ సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసారు.

తొలి నుంచి మెజార్టీ పైనే ఫోకస్
తొలి నుంచి ఆత్మకూరులో విజయం పైన ధీమా ఉన్న వైసీపీ ...ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా చెబుతూ వచ్చింది. అయితే, 64 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా ..అక్కడి నుంచే వైసీపీ అభ్యర్ధి ఆధిక్యత మొదలైంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217 పోలవ్వగా.. అందులో చెల్లిన ఓట్లు 205 గా నిర్దారించారు. వాటిలో వైసీపీకి 167 ఓట్లు పోలయ్యాయి. అప్పటి నుంచి చివరి రౌండ్ వరకు విక్రమ్ రెడ్డి ఆధిక్యత పెరుగుతూ వచ్చింది. విక్రమ్ రెడ్డి తొలి నుంచి తమ కుటుంబానికి చెందిన వ్యాపారాలను చూసుకొనే వారు. గౌతమ్ హఠాన్మరణంతో తప్పని పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. తొలి సారి ప్రజల మధ్యకు వచ్చిన విక్రమ్ తన అభ్యర్ధిత్వం ఖరారైన సమయం నుంచే ప్రజల్లోకి వెళ్లారు. ప్రతీ ఇంటికి వెళ్లి మద్దతివ్వాలని కోరారు.

తొలి ఎన్నికలోనే రికార్డు.. వైసీపీకి జోష్
16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యంతో ఉన్న వైసీపీ...17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యత లో నిలిచారు. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యత సాధించారు. 19వ రౌండ్ తో విక్రమ్ మెజార్టీ 80,161కి పెరిగింది. చివరగా మొత్తం 20 రౌండ్లు ముగిసే సరికి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వైసీపీకి.. ఇప్పుడు ఆత్మకూరు ఫలితం జోష్ పెంచటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ తో అధికార పక్షం ప్రజల్లో మద్దతు కోల్పోయిందని ప్రచారం చేస్తున్న ఈ సమయంలో ఆత్మకూరు మెజార్టీ పార్టీ బలం తగ్గలేదని చెప్పుకోవటానికి ఆయుధంగా నిలవనుంది.












Click it and Unblock the Notifications