కేంద్రానికి వైసీపీ బీసీ డిమాండ్- త్వరలో మోడీతో ఎంపీల భేటీ-డిమాండ్లు ఇవే...
ఏపీలో 2019 ఎన్నికల్లో బీసీల మద్దతుతో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో సీఎం జగన్... వైయస్సార్సీపీ తరఫున పలువురు బీసీ నేతల్ని పార్లమెంటుకు పంపారు. అంతే కాదు రాష్ట్రంలో బీసీల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఇప్పుడు కేంద్రం ముందు జగన్ ఎంపీలు పలు డిమాండ్లు పెట్టారు.
సామాజిక న్యాయం అమలులో సీఎం జగన్ దేశంలోనే ఒక రోల్మోడల్గా నిలిచారని ఢిల్లీలో ఇవాళ ప్రెస్ మీట్లో బీసీ ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, సత్యవతి, తలారి రంగయ్య తెలిపారు. మంత్రి పదవులు మొదలు అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మంత్రివర్గంలో ఏకంగా 10 మంది బీసీలు ఉన్నారన్నారు. నిజానికి తమది బీసీల పార్టీ అని చెప్పుకున్న వారు కూడా ఆ పని చేయలేదన్నారు. రాజ్యసభ టికెట్లు కూడా బీసీలకు ఎక్కువగా ఇచ్చారన్నారు. మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులుంటే, అందులో నలుగురు బీసీలు ఉన్నారని వారు తెలిపారు. ఇది దేశంలో ఎవరూ చేయలేదని గుర్తుచేశారు.
ఏపీలో బీసీలకు 50 శాతం పదవులు ఇస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టమే చేశారని వైసీపీ బీసీ ఎంపీలు తెలిపారు. మొత్తం కార్పొరేషన్లలో 109 పదవుల లెక్కన 76 శాతం పదవులు బీసీలకు ఇచ్చారన్నారు. అంతే కాకుండా అన్ని పథకాల్లోనూ బీసీలకు పూర్తి న్యాయం చేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా, నిరుపేదలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. అందుకే సీఎం వైయస్ జగన్ ఒక తత్వవేత్త. సిద్దాంతకర్త అని చెప్పాలన్నారు. తమకు జగన్ వల్లనే న్యాయం జరుగుతోందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలు నమ్మకంతో ఉన్నారని ఎంపీలు తెలిపారు.
బీసీల సంక్షేమం, అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వైసీపీ బీసీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ వారంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రధాని స్వయంగా ఒక బీసీ కాబట్టి.. ఆయన బీసీలకు న్యాయం చేయాలని వారు కోరారు. దేశంలో బీసీలు దాదాపు 75 కోట్లు ఉన్నారని, అంత పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నా, వారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల, విద్య, ఉద్యోగ రంగాలలో న్యాయం జరగడం లేదన్నారు. కేంద్రంలో మొత్తం 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, తాజాగా సహకార, మత్స్యశాఖలు ఏర్పాటు చేశారని, ఇందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నామని బీసీ ఎంపీలు తెలిపారు.
మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి 30 ఏళ్లు అవుతోందని వైసీపీ ఎంపీలు తెలిపారు. కేంద్రంలో విద్య, ఉద్యోగాలతో పాటు, పంచాయతీలలో బీసీలకు రిజర్వేషన్లు అమలువుతున్నాయని, వాటన్నింటికీ చూడడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కావాలన్నారు. అంతే కాకుండా ఆర్థికపరమైన రాయితీలు, స్కాలర్షిప్స్, రుణాలు, సబ్సిడీ రుణాలతో పాటు, బీసీలకు సంబంధించిన అనేక పథకాల అమలును చూడడం కోసం ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ అవసరమన్నారు. అలాగే కేంద్రంలో కూడా బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. మండల్ కమిషన్పై కేసు విచారణ సందర్భంగా 1992-93లోనే సుప్రీంకోర్టు ఈ సూచన చేసిందన్నారు. అయినా ఇప్పటికీ ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేయకపోవడం సరికాదని, కాబట్టి వెంటనే కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
అదే విధంగా చట్టసభల్లో బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించేలా, పార్లమెంటులో బిల్లు పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారు డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యసభలో మూడేళ్ల క్రితమే ప్రైవేటు బిల్లు పెట్టారన్నారు. దానికి చాలా పార్టీలు మద్దతు ప్రకటించినా, కేంద్రం సానుకూలంగా లేకపోవడం వల్ల పెండింగ్లో ఉందని, ఆ బిల్లు ఆమోదం పొందే వరకు వైయస్సార్సీపీ పోరాడుతుందన్నారు. నిజానికి పార్లమెంటులో బీసీలకు సంబంధించి 8 పార్టీలున్నా, ఏనాడూ అవి ఇలా బీసీ బిల్లును పెట్టలేదన్నారు. అదే విధంగా వివిధ పార్టీలకు చెందిన ఉభయ సభల్లో దాదాపు 150 మంది బీసీ సభ్యులున్నా, ఏనాడూ, ఎవరూ బీసీ బిల్లు గురించి ఆలోచించలేదన్నారు. ఇందుకు సీఎం జగన్ చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ బిల్లు ఆమోదం పొందే వరకు వైసీపీ పోరాడుతుందన్నారు.
బీసీలకు కేంద్రం తగిన న్యాయం చేయడం లేదని వైసీపీ ఎంపీలు తెలిపారు. బీసీలకు కనీసం లక్ష కోట్ల బడ్జెట్ పెట్టాలని వారు కోరారు. కేంద్ర బడ్జెట్ రూ.38.45 లక్షల కోట్లు కాగా, అందులో బీసీలకు కేవలం రూ.1400 కోట్లు మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. అందువల్ల కనీసం లక్ష కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రాల్లో అమలు చేసే పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలన్నారు. అదే విధంగా ప్రై వేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వారు కోరారు. ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని వారు కోరారు.