బదిలీ విమర్శలపై కౌంటర్ అటాక్: సవాంగ్ మొన్న పాలేరు..ఇప్పుడు మహాత్ముడయ్యారా: కొడాలి నాని
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకున్న రెండే రెండు ఉన్నతాధికారుల బదిలీలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ జగన్ ఆంతర్యం ఏమిటనేది డిబేట్లకు దారి తీసింది. అటు రాజకీయంగా ఈ బదిలీల వ్యవహారం దుమారం రేపుతోంది. విమర్శలను సంధించడానికి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలకూ అవకాశాన్ని ఇచ్చినట్టయింది. వీటన్నింటికీ వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితిని కల్పించినట్టయింది.
వైఎస్ జగన్..ఎన్నికల టీమ్ సిద్ధం: మరిన్ని బదిలీలు?: ఉగాది నాటికి అది కూడా పూర్తి
ప్రవీణ్ ప్రకాష్తో ఆరంభం..
నిజానికి- ఏ ప్రభుత్వంలోనైనా ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వ సాధారణమే. పరిపాలనకు అనుకూలంగా, వారి సామర్థ్యానికి అనుగుణంగా..పోస్టింగ్స్ ఇస్తుంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ రెండు బదిలీలు మాత్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదట ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ వ్యవహారమే ఆశ్చర్యానికి గురి చేయగా.. ఆ మరుసటి రోజే- ఏకంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్కు స్థానం చలనం కల్పించింది ప్రభుత్వం.
అనుమానాలున్నాయంటూ..
ఊహించినట్టే- ఉన్నతాధికారుల బదిలీలపై తెలుగుదేశం, జనసేన పార్టీ విమర్శలకు దిగాయి. టీడీపీ పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. గౌతమ్ సవాంగ్ బదిలీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అకస్మికంగా సవాంగ్ను బదిలీ చేయడానికి కారణాలను వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడలో పీఆర్సీ ఆందోళన విజయవంతమైనందుకే ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తాను భావిస్తున్నానంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు.
మొన్న పాలేరు అన్నారు..
టీడీపీ, జనసేన పార్టీ విమర్శలపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. వారి ఆరోపణలను తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా- పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ఈ రెండు పార్టీలపై కౌంటర్ అటాక్ చేశారు. గౌతమ్ సవాంగ్.. అధికార పార్టీకి పాలేరుగా వ్యవహరిస్తున్నారంటూ రెండు రోజుల కిందటే చంద్రబాబు నాయుడు విమర్శించారని, ఆయన బదిలీ కాగానే టీడీపీకి మహాత్ముడైపోయారా అని ప్రశ్నించారు.
కొడుకును కూడా గెలిపించుకోలేడు..
చంద్రబాబు అనేవాడు.. తన కొడుకును కూడా గెలిపించుకోలేని పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ కొడాలి నాని విమర్శించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సిగ్గు, శరం ఉన్నవాడెవడైనా కృష్ణానదిలో దూకి ఉండేవాళ్లని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఈ రెండూ లేవు కాబట్టే సొల్లు కబుర్లు చెప్పుకొని బతికేస్తున్నాడని విమర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్- వైసీపీ షర్ట్, కండువా వేసుకుని, వైఎస్ జగన్ ఏది చెబితే అది చేస్తున్నాడంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను గుర్తు చేశారు.
గంజాయిని తగులబెట్టినప్పుడు పాలేరుగా విమర్శించలేదా..
పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు తగులబెట్టినప్పుడు డీజీపీని వైఎస్ జగన్ పాలేరుగా చంద్రబాబు అభివర్శించారని కొడాలి నాని చెప్పారు. బదిలీ కాగానే మహాత్ముడన్నట్లు మాట్లాడుతున్నాడని చెప్పారు. మంగళగిరిలో కొడుకును, తన సొంత నియోజకవర్గం కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక చంద్రబాబుకు మతి భ్రమించినట్టయిందని అన్నారు. తనకు అనుకూల మీడియాలో నాలుగు మాటలు చెప్పుకొంటూ చంద్రబాబు బతికేస్తున్నాడనడానికి గౌతమ్ సవాంగ్ బదిలీ నిదర్శనమని కొడాలి నాని అన్నారు.