YS Jagan: సినిమా చూపిస్తా.. మామూలుగా ఉండదు..జగన్ మరో వార్నింగ్..!
వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్రంలో ఎదురవుతున్న వేధింపులపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ వ్యవహారశైలి దారుణంగా ఉందన్నారు. బాధలనీ చూస్తున్నానని, భరోసా ఇస్తున్నానని తెలిపారు. జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వారికి అన్ని విధాలా పూర్తి న్యాయం చేస్తామన్నారు. రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు.
అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులు, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని, వారు ఎక్కడున్నా, సప్త సముద్రాల అవుతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిని తప్పకుండా సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల మధ్య పవిత్ర తులసి మొక్కల్లా, తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి, వాటిని చంద్రబాబుకు చూపి, నిలబడిన మీ అందరికీ మీ జగన్ హ్యాట్సాఫ్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పువు విలువలు, విశ్వసనీయత ఉండాలని, కానీ వాటన్నింటినీ చంద్రబాబు దిగజార్చారన్నారు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు.

రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగిందని, అక్కడ మొత్తం 16 మంది వైయస్సార్సీపీకి చెందినవారే అన్నారు. అయినా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, 6 గురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారన్నారు. కోరం లేకపోయినా, కేవలం 6 గురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారన్నారు.
సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైసీపికి చెందిన వారే అయినా, అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగిందన్నారు. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడన్నారు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడన్నారు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదన్నారు. అదే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో 15 మంది వైసీపీ వారేనని, అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడన్నారు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరన్నారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు ఉన్నారని, కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్ అన్నారు. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారన్నారు. ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గు పడాలన్నారు. ఎక్కడైనా, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలని, అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా వైసీపీ నేతలు రాజకీయాల్లో అత్యంత విలువలతో పని చేస్తున్నారన్నారు.
ఇవన్నీ చూశాక, తాను ఒకటే చెబుతున్నానని, కేవలం వైయస్సార్సీపీని ప్రేమించినందుకు, తనను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నానని జగన్ తెలిపారు. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానన్నారు. వారికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. వారికి అడుగుడుగునా తోడుగా, అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. మిమ్మల్ని (పార్టీ నాయకులు), కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు.
ఈరోజు వారు చేస్తున్న దుర్మార్గం. ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందని, అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టబోమన్నారు. పట్టుకుని తీసుకొస్తామని, వారికి సినిమా చూపిస్తామని, అది మామూలుగా ఉండదన్నారు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడని, టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుందని అడిగారు.
చూస్తుండగానే ఏడాది గడిచిందని, కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయని జగన్ తెలిపారు. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ అప్పుడు వదిలిపెట్టబోమన్నారరు. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తా. అది మామూలుగా ఉండదన్నారు.












Click it and Unblock the Notifications