బీజేపీకి జగన్ సర్కార్ కౌంటర్- కేంద్రం వల్లే గణేశ్ ఆంక్షలు- రెచ్చగొడితే కేసులు తప్పవని వార్నింగ్
ఏపీలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల విషయంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ నేతలు మాత్రం కేంద్రాన్ని తప్పుబట్టకుండా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇవాళ సీఎం జగన్ దీనిపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులతో మాట్లాడారు. బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలిశారు. వినాయక చవితి పండుగ నిర్వహణపై భాజపా నేతల ఆందోళన అంశంపై సీఎంతో వెల్లంపల్లి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు రోజులుగా రాష్ట్రంలో టీడీపీ తొత్తులైన బీజేపీ, జనసేన ఆందోళనలు చేస్తున్నాయనని మండిపడ్డారు. కర్నూలులో వినాయకుడిని పట్టుకుని సోము వీర్రాజు డ్రామా ఆర్టిస్టులతో కలసి డ్రామా చేశారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి పండుగ చేసుకోకూడదని ఎవరైనా చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని వెల్లంపల్లి తెలిపారు.

మతం ముసుగులో రాష్ట్రంలో ఎంటరవ్వాలని భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. హిందూ మతంపై ప్రేమ ఉండి ఉంటే గతంలో గుడులు కూల్చినపుడే చంద్రబాబు కూటమి నుంచి భాజపా బయటకు రావాలి.కానీ రాలేదని గుర్తుచేశారు. సీఎం జగన్ చక్కగా పరిపాలిస్తుంటే భాజపా నేతలు ప్రభుత్వంపై మతాలు కులాల ముద్ర వేస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. బీజేపీ వారికీ సంక్షేమ పథకాలు సీఎం అందిస్తున్నారనే విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలన్నారు.
బీజేపీ నేతలు ఆందోళనలు చేయాల్సింది ఏపీలో కాదు ...ప్రధాని వద్ద చేయాలని వెల్లంపల్లి సూచించారు. కేంద్రం పంపించే రూల్స్ ను మార్పించే దమ్ము ధైర్యం భాజపా నేతలకు ఉందా అని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేలా కేంద్రం హోం సెక్రటరీ నిబంధనలు ఇచ్చారని, ఆదేశాలిచ్చిన కెంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమా అని వెల్లంపల్లి నిలదీశారు. బీజేపీ నేతలు డిల్లీ వెళ్లి నిబంధనలు మార్పించాలని సూచించారు. కేవలం కులాలు ,మతాల మధ్య చిచ్చు పెట్టలా సోము వీర్రాజు సహా నేతలు వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు.

వినాయక చవితి పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, కేవలం 20మందితో వినాయక చవితి చేసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని వెల్లంపల్లి గుర్తుచేశారు. రాష్ట్రానికి కోవిడ్ రావాలని మీ కోరికా.. దయచేసి ప్రజలను రెచ్చగొట్టవద్దని వెల్లంపల్లి బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రం నిబంధనల ప్రకారం బీజేపీ నేతల పై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. బీజేపీ నేతలు రెచ్చగొడుతూ ఎందుకు గందరగోళం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కోవిడ్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి బీజేపీ నేతలకు కనపడటం లేదా అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
విద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో భారీ వినాయక విగ్రహాలు పెడతాం అంటే ఒప్పుకోబోమన్నారు. భాజపా నేతలకు చిత్త శుద్ది ఉంటే వెంటనే డిల్లీకి వెళ్లి కేంద్ర హోం సెక్రటరీ ఇచ్చిన నిబంధనలు మార్పించాలన్నారు. జన సంచారం లేకుండా కోవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రజలు వినాయక చవితి జరుపుకోవాలని వెల్లంపల్లి సూచించారు.












Click it and Unblock the Notifications