ఆ కుటుంబానికి రూ.కోటి నగదు, ఐదెకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం!
పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ హత్య పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యంతోనే జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది యాదృచ్ఛిక హత్య కాదని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పక్కా ప్రణాళికతో జరిగిన ప్రభుత్వ హత్యగా వైయస్సార్సీపీ నేతలు అభివర్ణించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.
డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కొంచం సేపు ధర్నాకు కూర్చున్నారు. అనంతరం ఏడీజీకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని, రాష్ట్రం మొత్తం డెకాయిట్ పాలనను తలపిస్తోందని విమర్శించారు.

మందా సాల్మన్ అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన సమయంలో పట్టపగలే ఇనుప రాడ్లతో దారుణంగా హత్య చేయబడినప్పటికీ, పోలీసులు ముందస్తు సమాచారం ఉన్నా స్పందించలేదని వైయస్సార్సీపీ ఆరోపించింది. పైగా చావు బతుకుల మధ్య ఉన్న సాల్మన్పైనే కేసు నమోదు చేయడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. హత్యకు బాధ్యులైన వారితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.కోటి నగదు పరిహారం, ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేసింది. అలాగే గురజాల ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరింది. పిన్నెల్లి గ్రామం నుంచి భయంతో వెళ్లిపోయిన దాదాపు 200 కుటుంబాలను తిరిగి గ్రామానికి తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ నేతలు ధర్నా చేపట్టగా, చివరకు వినతిపత్రం స్వీకరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి మందా సాల్మన్ హత్యే తాజా నిదర్శనమని వైయస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications