అనంత వైసీపీలో "పట్టు" తప్పుతోంది: మంత్రి పెద్దిరెడ్డికి అసమ్మతి సెగ - చెప్పులు విసిరి..!!
అనంతపురం వైసీపీలో అసమ్మతి కట్టలు దాటుతోంది. ఎమ్మెల్యేలపైన ఉన్న వ్యతిరేకత చెప్పులు విసిరే వరకూ వెళ్తోంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి జిల్లా పార్టీ వ్యవహారాలు పరీక్షగా మారుతున్నాయి. మంత్రి నిర్వహిస్తున్న సమీక్షలు..పర్యటనల సమయంలో నిరసనలు దారి తప్పుతున్నాయి. పెద్దిరెడ్డి స్యయంగా కార్యకర్తలకు సర్ది చెబుతున్నారు. నేతలను వారించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేలపై ఆగ్రహం మాత్రం కార్యకర్తల్లో చల్లారటం లేదు. తాజాగా పెనుగొండలో మంత్రిపెద్దిరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు చెప్పులు విసరటం పార్టీలో కలకలానికి కారణమవుతోంది.
ఎమ్మెల్యేకు వ్యతిరేకం నినాదాలతో
అనంతపురం జిల్లా పెనుకొండలో వైసీపీ అసమ్మతి బయట పడింది. సీనియర్ మంత్రి..పార్టీ జిల్లా ఇంఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లా వ్యవహారాలు టెన్షన్ పెడుతున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..జిల్లాలో నేతల మధ్య అనైక్యత - నిరసనలు తారా స్థాయికి చేరుతున్నాయి. అసమ్మతి చెప్పులు వేసే స్థాయికి చేరింది.
నియోజకవర్గానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే శంకర నారాయణ తమకు వద్దంట అసమ్మతి వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ చేరుకొనే ప్రాంతంలో బైఠాయించి జగనన్న ముద్దు..శంకర్ నారాయణ వద్దు.. నాన్ లోకల్ వద్దు.. లోకల్ మద్దు అంటూ నినాదాలు చేసారు. ప్రతిగా ఎమ్మెల్యే మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కిందరు దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేసారు.
పెద్దిరెడ్డి చెప్పినా వినకుండా.. చెప్ప విసిరి
ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు నచ్చ చెప్పేందుకు మంత్రి పెద్దిరెడ్డి వారితో చర్చించారు. నినాదాలు ఆపాలని..చర్చించి పరిష్కరించుకుందామని సూచించారు. అయినా వారు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే అవినీతిపరుడని, ఆయనకు టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. సహనం కోల్పోయిన పెద్దిరెడ్డి వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది.
ఆందోళన చేస్తన్న వారిలో ఒకరు తన చెప్పులను విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు 15 నిమిషాల పాటు మంత్రి కాన్వాయ్ నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి చెదర గొట్టారు. అభ్యంతరాలు ఉంటే సమావేశం తరువాత మాట్లాడుకుందామంటూ మంత్రి పెద్దిరెడ్డి చెప్పినా ఎమ్మెల్యే శంకర నారాయణ ను వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం వినిపించుకోలేదు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులును చక్క దిద్దుతామని.. అసమ్మతి లేని నియోజకవర్గం లేదని మంత్రి పెద్దిరెడ్డి ఆ తరువాత సమీక్షలో చెప్పుకొచ్చాకె.
మంత్రి పెద్దిరెడ్డి సమర్ధతకు పరీక్షగా..
అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ ..2 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలోని హిందూపూర్.. ఉరవకొండ మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్ సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇక, వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో జిల్లాలో పరిస్థితుల పై వారం రోజులుగా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు.
టీడీపీ సిట్టింగ్ పయ్యావుల ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ సమీక్షలో మొదలైన అసమ్మతి ..పెనుకొండ వరకు కొనసాగింది. పుట్టపర్తి, హిందూపురంలోనూ అసమ్మతి తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. కుప్పంలో గెలవబోతున్నాం.. హిందూపురంలో ఎందుకు గెలవలేం అంటూ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ సమీక్షలో ప్రశ్నించారు.
ఇక..ఈ జిల్లాలో సొంత పార్టీలో నెలకొన్న అసమ్మతి చక్కదిద్ది.. ఎన్నికలకు సిద్దం చేయటం పెద్దిరెడ్డి సమర్ధతకు పరీక్షగా మారుతోంది. జిల్లాలో త్వరలోనే పార్టీ పరంగా కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.