వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను - వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ప్రకటన..!!
వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కీలక ప్రకటన చేసారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 1983 టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన చెన్నకేశవ రెడ్డి కర్నూలు జిల్లాలో వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు వైసీపీలో చర్చకు కారణమవుతోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా..
2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మగినూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత..ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీవీ మోహన్ రెడ్డి పైన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి వరుస విజయం సాధించారు. ఇక, వైఎస్సార్ మరణం.. 2012 లో వైసీపీ ఆవిర్భావంతో అసెంబ్లీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన అవిశ్వస తీర్మానంలో వ్యతిరేకంగా ఓటు వేసారు. వైసీపీ నుంచి 2012 ఉప ఎన్నికల సమయంలో ఎమ్మిగనూరు నుంచి మరోసారి బీవీ మోహన్ రెడ్డి పైన గెలిచి మూడో సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి జయనాగేశ్వర రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్ధి జయనాగేశ్వర రెడ్డి పైన విజయం సాధించి సీనియర్ నేతగా పార్టీలో కొనసాగుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటన
ఇప్పుడు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఎమ్మిగనూరులో జరిగిన వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తననే పోటీ చేయాలని చెబితే ..తన వయసు ఇప్పుడు 83గా చెప్పుకొచ్చారు. గుండె జబ్బు ఉందన్నారు. ఎక్కువ సేపు మాట్లాడలేను..జనంలో తిరగలేను..పోటీ చేయలేనని చెప్పానని చెన్నకేశవ రెడ్డి వెల్లడించారు. తన కుమారుడు జగన్మోహన రెడ్డికి సీటు ఇచ్చే అంశం పైన సర్వే చేయిస్తున్నామని సీఎం చెప్పారని పేర్కొన్నారు. తన కుమారుడికి సీటు ఇస్తే అందరూ సహకరించాలని చెన్నకేశవ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పర్యటన సమయంలోనే ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే కుమారుడికి సీటు కేటాయింపు విషయం పైన పార్టీలో చర్చ జరిగింది. అయితే, దీని పైన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని సజ్జల హామీ ఇచ్చారు. సీఎం ఇప్పటికే చేయించిన సర్వే నివేదిక కూడా అందినట్లు తెలుస్తోంది.

వారుసుల కోసం సీనియర్ల త్యాగాలు
కొద్ది రోజలు క్రితం గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇదే రకంగా ప్రకటన చేసారు. తన కుమార్తె వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. వారసులకు టికెట్ల విషయంలో వైసీపీలో చర్చ సాగుతున్న సమయంలోనే ముస్తఫా చేసిన ప్రకటన కొత్త చర్చకు కారణమైంది. కొద్ది నెలల క్రితం సీఎం వద్ద జరిగిన పార్టీ సమీక్షలో సీఎం జగన్ మంత్రి బుగ్గన..మాజీ మంత్రి పేర్ని నాని వారసులకు టికెట్ల విషయంలో చేసిన వ్యాఖ్యలతో తమ వారసులను రంగ ప్రవేశం చేయించేందుకు సిద్దమైన నేతలకు షాక్ గా మారింది. ఆ నిర్ణయం వారిద్దరికేనా..అందరికీ వర్తిస్తుందా అనే క్లారిటీ కోసం సీనియర్లు నిరీక్షిస్తున్నారు. అయితే, చెన్నకేశవ రెడ్డి లాంటి సీనియర్లు..వయోభారం కారణంగా తప్పుకోవాలని భావిస్తున్న సమయంలో సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications