వంగవీటి రాధాపై వైసీపీ లెక్క తప్పిందా ? అందుకేనా ఎదురుదాడి- యూటర్న్ వెనుక జరిగిందిదీ !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న పోరులో వంగవీటి రాధా వ్యవహారం కీలకంగా మారిపోయింది. విజయవాడ రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా లేకపోయినా కుల సమీకరణాల్లో కీలకంగా ఉన్న వంగవీటి రాధాని తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు గత దశాబ్ద కాలంలో చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా టీడీపీలో ఉన్న రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇందులో భాగంగా తనపై రెక్కీ ఆరోపణలు చేసిన రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నించి మంత్రి కొడాలి, ఎమ్మెల్యే వంశీ విఫలమైనట్లు అర్ధమవుతోంది.
వైసీపీలోకి వంగవీటి రాధా
గతంలో వైసీపీలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లిన వంగవీటి వారసుడు రాధాకృష్ణను తిరిగి తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు మంత్రి కొడాలి నాని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. కృష్ణాజిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ జనాభా ప్రభావం చూపగల స్ధాయిలో ఉంది. అంతెందుకు విజయవాడలో సైతం తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు ప్రతీ ఎన్నికల్లో కీలకమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని తన పాతమిత్రుడైన రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు కొడాలి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా తన నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు చేసి దాని ఆవిష్కరణకు రాధాను ఆహ్వానించారు. అక్కడే బిగ్ ట్విస్ట్ ఎదురైంది.
రాధా రెక్కీ ఆరోపణలు
తండ్రి వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు వచ్చిన రాధా ఆ కార్యక్రమం పూర్తయ్యాక వెళ్తూ వెళ్తూ మీడియాతో మాట్లాడారు. తాజాగా తన హత్యకు కుట్ర జరిగిందని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తివివరాలు త్వరలో బయటపెడతానన్నారు. అంతే వెంటనే రంగంలోకి దిగిన కొడాలినాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు పరిస్ధితిని వివరించారు. రాధాను పార్టీలోకి తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదని నచ్చజెప్పారు. 24 గంటల్లోనే రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్ల సెక్యూరిటీ ఇప్పించేశారు. అయితే రాధా మరోసారి ట్విస్ట్ ఇచ్చారు.
రాధా రివర్స్ టర్న్
అప్పటివరకూ మంత్రి కొడాలి నాని పిలిస్తే తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లి, తన ప్రత్యర్ధులపై సంచలన ఆరోపణలు కూడా చేసిన వంగవీటి రాధా.. ఆ తర్వాత మాత్రం యూటర్న్ తీసుకున్నారు. తనకు ప్రభుత్వం ఇస్తానన్న భద్రతను తిరస్కరించారు. ఇన్నాళ్లూ తాను సెక్యూరిటీ లేకుండానే జనంలో తిరిగానన్నారు. అంతే కాదు వైసీపీలోకి వస్తారన్న అంచనాల్ని సైతం పటాపంచలు చేస్తూ టీడీపీ, కాపు నేతలతో భేటీలు కావడం మొదలుపెట్టారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం భేటీ అయ్యారు. దీంతో రాధా వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పడిపోయింది.
రాధాపై వైసీపీ కౌంటర్ అటాక్
రాధా ఎప్పుడైతే వైసీపీలోకి రావడం లేదని తేలిపోయిందో, ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన భద్రతను తిరస్కరించారో అప్పుడే వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఈ వ్యవహారంలో తమ పరువుపోయేలా ఉందని భావించి రాధాపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా పదే పదే మీడియా ముందుకొచ్చి రాధా రెక్కీ వ్యవహారంలో ఆధారాలు దొరకలేదని, రాధా వద్దన్నా భద్రత కల్పిస్తున్నామని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్ధానిక మంత్రి వెల్లంపల్లి మీడియా ముందుకొచ్చి రాధాకు అంత సీన్ లేదని తేల్చేశారు. తన తండ్రిని హత్య చేసిన పార్టీలో రాధా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. రాధాను రాజకీయాల్లో అంతా మర్చిపోయారన్నారు. మెయిన్ రోడ్డులో ఉన్న రాధా ఇంటి వద్ద కారు తిరిగితే అది రెక్కీనా అని నిలదీశారు. దీంతో రాధా విషయంలో వైసీపీ వైఖరి స్పష్టమైపోయింది.
Recommended Video
వైసీపీ ఎదురుదాడి వెనుక ?
రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు ఓవైపు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని ప్రయత్నించి విఫలమయ్యారు అదే సమయంలో రాధా తన రెక్కీపై వివరాలు బయటపెట్టడం కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ చేయడం లేదు. దానికి బదులుగా తన సొంత పార్టీతో పాటు కాపు నేతలతో భేటీలు నిర్వహించి వైసీపీకి సవాల్ విసురుతున్నారు. దీంతో వైసీపీ చేసేది లేక ఎదురుదాడికి దిగినట్లు కనిపిస్తోంది. అదే నిజమైతే భవిష్యత్తులో మరింత మంది వైసీపీ నేతలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతలు రాధాపై ఎదురుదాడికి దిగే అవకాశాలున్నాయి.