23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సజ్జల..
ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ఏపీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్ వ్యవహారం పూర్తిగా రాజకీయమలుపు తిరింది. ఏబీవీ పేరు ప్రస్తావించకుండా ఉద్యోగులపై ఉద్యోగులపై సీఎం జగన్ ఫ్యాక్షన్ పంజా విసిరారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించగా, టీడీపీకే చెందిన ఎంపీ కేశినేని నాని మాత్రం.. 'వైసీపీ గెలుపునకు కారణమైన వ్యక్తిని అభినందించకుండా చర్యలు తీసుకున్నారేంట'ని భిన్నంగా స్పందించారు. ఇదే వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు, సీఎం జగన్ సన్నిహితుడైన సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందింస్తూ.. పలు సంచలన విషయాలు వెల్లడించారు.

అందుకే ఇదంతా..
ఐపీఎస్ అధికారి ఏబీవీ సస్పెన్షన్ కు సంబంధించి వైసీపీ సర్కారు మొత్తం ఏడు కారణాల్ని పేర్కొంది. వాటిలో ప్రధానమైంది. సెక్యూరిటీ పరికరాల కొనుగోళ్లు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పని చేసిన సమయంలో ఏబీవీ నిబంధనలకు విరుద్దంగా ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు చేశారని, వాటికి తప్పుడు పనులకు వాడారని ప్రభుత్వం ఆరోపించింది. సదరు అధికారి ప్రజల రక్షణ కోసం కాకుండా అప్పటి సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసినందుకే సస్పెన్షన్ కు గురయ్యారని సజ్జల తెలిపారు.

ఆయనే దళారీ..
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తర్వాతి కాలంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం తెలిసిందే. ఫిరాయింపులపై మొదటి నుంచీ వైసీపీ పోరాడినా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించలేకపోయింది. అయితే నాటి ఫిరాయింపుల వ్యవహారంలో ఐపీఎస్ అధికారి ఏబీవీనే దళారీగా వ్యవహరించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

పెద్ద మాఫియా నడిపారు..
‘‘చంద్రబాబు హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీవీ పెద్ద మాఫియాను నడిపారు. ప్రజల రక్షణ కోసం కాకుండా టీడీపీ ప్రయోజనాలకోసం ఏబీవీ పనిచేశారు. వైసీపీని దెబ్బతీయడానికి ప్రభుత్వ నిఘా వ్యవస్థను వాడుకున్నారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులోనూ ఏబీవీనే దళారీగా పనిచేశారు. విదేశాల నుంచి కొన్న నిఘా పరికరాలతో వైసీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారు''అని సజ్జల పేర్కొన్నారు.

టీడీపీ ఎంపీనే అంగీకరించారు.
కాగా, చంద్రబాబు హయాంలో ఏబీవీ అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘వైసీపీ అధికారంలోకి రావడానికి, టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి కారకుడైన అధికారిని అభినందిస్తారనుకుంటే.. సస్పెండ్ చేశారేంటి జగన్ గారు?''అని ఎంపీ నాని చేసిన ట్వీట్ ను సజ్జల ప్రస్తావించారు. ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications