మేం తెచ్చిన కంపెనీలకు మీ రిబ్బన్ కటింగా ? జగన్ ఓపెనింగ్స్ పై అచ్చెన్నాయుడు ట్వీట్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న వార్ లో ప్రతీ అంశం ఇప్పుడు కీలకంగా మారిపోతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు తీసుకురావడంలో వైసీపీ సర్కార్ విఫలమవుతుందని ఆరోపిస్తున్న టీడీపీ.. ఇవాళ అనకాపల్లి, విశాఖల్లో వైఎస్ జగన్ పరిశ్రమల ప్రారంభోత్సవాల్ని తప్పుబడుతోంది.
తమ హయాంలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలకు మీరు రిబ్బన్ కటింగ్స్ చేస్తారా, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా లేదా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ ట్వీట్లు పెట్టారు. ఇందులో సీఎం జగన్ ఇవాళ చేసిన ప్రారంభోత్సవాల్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి టీడీపీ హయాంలో తెచ్చిన పరిశ్రమల్ని ట్వీట్లలో ప్రస్తావించారు. వాటికి ఇప్పడు జగన్ రిబ్బన్ కటింగ్స్ చేస్తున్నారని విమర్శించారు.
"కియా మోటార్స్, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఇసుజు, అపోలో టైర్స్, టీసీఎల్, యోకొహమా, ఇలా గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీలు అన్నింటికీ రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప జగన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కంపెనీ ఒక్కటైనా ఉందా? ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రిని అని ప్రచారం చేసుకోవడం అంటే ఇదే." అంటూ ట్వీట్లో అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
అచ్చెన్నాయుడు తన ట్వీట్ లో ఇవాళ అచ్యుతాపురం సెజ్ లో సీఎం జగన్ ఏటీసీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవం చేస్తున్న వీడియోతో పాటు గతంలో టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల వార్తల్ని కూడా పెట్టారు. తద్వారా తమ హయాంలో వచ్చిన కంపెనీలకు ఇప్పుడు జగన్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. దీంతో అచ్చెన్నాయుడు ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.