ఎపిలో జగన్కు వరంగల్ ఉప ఎన్నిక గతే: సోమిరెడ్డి శాపనార్థాలు
నెల్లూరు/ హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేలా నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటన సాగిందని తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తొలి ప్రయత్నంలో అధికారంలోకి రాని ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయులుగా ఉండేవారిని టీడీపీలోకి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో ఐదో స్థానంలో నిలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఏపీలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. ఆనం సోదరులు పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ పాలనలో ఇసుక రీచ్లను అనుచరులకు దోచిపెట్టారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి రూ. 80 కోట్ల ఆదాయం వస్తే, ఇప్పుడు నవ్యాంధ్రలోనే రూ. 800 కోట్ల ఆదాయం వస్తోందని ఆమె తెలిపారు. ఇసుక మైనింగ్లో మహిళా గ్రూపుల భాగస్వామ్యం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆమె చెప్పారు.
అవినీతి పార్టీలు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని పరోక్షంగా వైసీపీని విమర్శించారు. ప్రస్తుత ఇసుక పాలసీలో లోటుపాట్లను సవరించి జనవరి 1 నుంచి మరింత పటిష్టమైన ఇసుక విధానం అమలు చేస్తామని ముళ్లపూడి రేణుక తెలిపారు.
కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్ట్టైమ్ రాజకీయ నేత అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. జగన్కు తీరిక ఉన్నప్పుడే ప్రజలను పరామర్శిస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ దొరల పార్టీ అని. వైసీపీ భూస్వాముల పార్టీ అని విమర్శించారు. ఎన్టీఆర్ వచ్చాకే బడుగులకు న్యాయం జరిగిందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు.












Click it and Unblock the Notifications