ఇక రాష్ట్రంలోనూ పోరు ఉధృతం.. నేడే రహదారుల దిగ్భంధం: వైసీపీ మరో కార్యాచరణ
Recommended Video

అమరావతి/న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనా పోరాటాన్ని రాష్ట్రంలోనూ ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. టీడీపీ ఎంపీలు ఢిల్లీ నుంచి తిరుగు పయనమై.. ఇక రాష్ట్రంలోనే కార్యాచరణకు సిద్దమవుతున్న దశలో.. వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
హోదా ఉద్యమం తమ క్రెడిటే అని ముందు నుంచి ప్రచారం చేసుకుంటున్న వైసీపీ.. ఏ దశలోనూ టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. హోదాపై టీడీపీ కార్యాచరణలో భాగంగా.. వైసీపీని లక్ష్యంగా చేసుకనే అవకాశం ఉంది గనుక, రాష్ట్రంలోనూ హోదాపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టడానికి వైసీపీ సిద్దమైంది. టీడీపీ ఆరోపణలను, విమర్శలను తిప్పికొడుతూనే.. హోదా ఉద్యమాన్ని తాము ఎలా ముందు తీసుకెళ్తున్నది ప్రజలకు వివరించనుంది.

నేడు రహదారుల దిగ్బంధం..:
ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మంగళవారం నుంచి మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జాతీయ రహదారులను దిగ్బంధం, బుధవారం నాడు రైల్రోకో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

రైల్ రోకోకి పిలుపు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంతకల్, గుత్తి, కర్నూలు, అనంతపురంలలో రైల్రోకోలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినాయకత్వం పిలుపునిచ్చింది.

నాలుగో రోజుకు దీక్ష:
ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పూర్తిగా క్షీణించడంతో ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఎంపీలు అవినాశ్రెడ్డి, పీవీ మిథున్రెడ్డి ఏపీ భవన్లో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా వేదికపై కూర్చున్నారు.

శరద్ యాదవ్ సంఘీభావం:
వైసీపీ పోరాటానికి జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మద్దతు పలికారు. వైసీపీ ఎంపీలు ఆమరణదీక్ష చేస్తున్న వేదికను సందర్శించి పలువురితో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి ప్రత్యేకే హోదా అమలుచేసి తీరాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications