ఎంత అవమానం.. NTR విగ్రహానికి YCP రంగులు.. కొడాలి నానీయే కారణం?
తెలుగువాడికి ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతిని తీసుకురావడమే కాకుండా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, ఢిల్లీ పెద్దల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారకరామారావు. ఆయన పెట్టిన భిక్షతో ఎంతోమంది రాజకీయాల్లో రాణించారు. అందుకు కృతజ్ఞతగా పార్టీలు మారలేక రాజకీయాల నుంచి విరమించుకున్నవారు కొందరైతే కాలానుగుణంగా తమను తాము మార్చుకుంటూ పార్టీలోనే కొనసాగుతున్నవారు మరికొందరున్నారు.
అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహానికి సొంత నియోజకవర్గంలోనే ఘోరమైన అవమానం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను ఆ విగ్రహానికి వేశారు. అది కూడా కృష్ణా జిల్లా మినీ మహానాడు జరగనున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో
చంద్రబాబునాయుడు రానున్న తరుణంలోనే..
మరో రెండురోజుల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇక్కడ పర్యటించనున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడమంటే కవ్వింపు చర్యలకు పాల్పడటమేనని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి ఇక్కడ ఏదో ఒకవిధంగా గలాటా సృష్టించాలనే ఉద్దేశంతోనే దుండగులు ఇటువంటి పనులకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.
మినీ మహానాడుకు కూతవేటు దూరంలో..
గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఈ సంఘటన జరిగింది. చంద్రబాబునాయుడు మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో ఈ గ్రామం ఉంది. రాత్రికి రాత్రే కొందరు దుండగులు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీకి చెందిన మూడు రంగులు వేశారు.
విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఇతర సీనియర్ నాయకులు అక్కడికి చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విగ్రహానికి శుద్ధి చేసిన అనంతరం వైసీపీ రంగులు చెరిపివేసి తెలుగుదేశం పార్టీ జెండా రంగులు వేయించారు.
కొడాలి నానీయే కారణం
మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని, ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేసుకుంటూ, మహానాడు బ్యానర్లపై అధికార పార్టీ బ్యానర్లు కడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మినీ మహానాడును, చంద్రబాబునాయుడును ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.