జగన్ జైల్లో ఉన్నపుడే బాగుంది: చిరు, సారథి: రఘువీరా
నెల్లూరు: వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడే తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఇప్పుడు పార్టీకి రోజు రోజు ఆదరణ తగ్గిపోతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి మంగళవారం అన్నారు.
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతల బస్సుయాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడమే తమ లక్ష్యమన్నరు. రాష్ట్ర విభజనను సమర్థించిన పార్టీలలో కాంగ్రెసు నాయకులు చేరడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెసు పార్టీకి తప్పకుండా తాము పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతాన్ని సింగపూర్లా చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన హాజరు కాలేదని, సీమాంధ్రకు ఏం కావాలో అడగలేదని ఆరోపించారు.
ద్రోహుల వల్లనే: రఘువీరా
కొంతమంది ద్రోహుల వల్లనే కాంగ్రెసు పార్టీకి సీమాంధ్ర ప్రాంతంలో ఈ పరిస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ పునాదులు అలాగే ఉన్నాయని చెప్పారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి చిరంజీవే రథసారథి అన్నారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం: బిజెపి
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు వేరుగా చెప్పారు. హైదరాబాద్ కేంద్రీకృత విధానాల వల్ల ఆంధ్రా ప్రాంతం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వికేంద్రీకృత అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు.