'అమరావతిలో రూ.లక్ష కోట్ల స్కాం': లోకేష్ బినామీ అంటూ.., ఎవరీ రవి?
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిలో లక్ష కోట్ల భూకుంభకోణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెరలేపారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి బుధవారం ఆరోపించారు. అమరావతి సమీప గ్రామాల్లో జరుగుతున్న భూకుంభకోణాన్ని వైసిపి మొదటి నుంచి చెబుతూనే ఉందన్నారు.
చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ఏపీ అంతా అవినీతిమయం చేసిన ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
కాగా, సాక్షి పత్రికలో నారా వారి బినామీ దందా.. అంటూ రాజధానిలో టిడిపి నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారని వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు, మంత్రులు, నారా లోకేష్ పైన సాక్షి పత్రిక తీవ్ర ఆరోపణలు చేసింది. నారా లోకేష్, ఇతర టిడిపి నేతల బినామీలు వీరు అంటూ కొన్ని పేర్లు ఇచ్చింది.
లోకేష్ బినామీలు అంటూ రవికుమార్ తదితరులు అంటూ పేర్లు ఇచ్చింది. వీరి పేరిట రాజధానిలో 500 ఎకరాలు చెల్లించారని, చెల్లించింది మాత్రం రూ.50 కోట్లు అని, ప్రస్తుత విలువ రూ.650 కోట్లు అని పేర్కొంది. అంతేకాదు, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారని ఆరోపించింది. రవికుమార్ ఎవరో కూడా అందులో రాసింది.
ఎవరీ రవికుమార్?
లోకేష్ బినామీగా వేముల రవిని చెప్పిన సాక్షి అతను ఎవరో కూడా పేర్కొంది. ఈవీఎంలు చోరీ చేసి, ట్యాంపరింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు యత్నించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ సోదరుడే ఈ రవి అని పేర్కొంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతలను హరికృష్ణ ప్రసాద్ నిర్వహించారని పేర్కొంది. టిడిపి, హెరిటేజ్ ఫుడ్స్, ప్రభుత్వ ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించే వేమూరి హరికృష్ణ ప్రసాద్ను.. చంద్రబాబు అధికారం చేపట్టగానే ఈ గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో సభ్యునిగా నియమించారని పేర్కొంది.
వేమురి రవి కుమార్ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేశారని, అందకు క్విడ్ ప్రోకోగా చంద్రబాబు అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 9న రవిని ప్రభుత్వ సలహాదారుగా నియమించిందని రాశారు. రవి, కుటుంబం, ఆయన సంస్థ పేరిట 500 ఎకరాలు కొనుగోలు చేశారని రాసింది.
కేంద్రమంత్రి సుజనా చౌదరి బినామీలు శ్రీ కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్, శివరామకృష్ణ అని పేర్కొంది. సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో 700 ఎకరాలు కొనుగోలు చేశారని, అందుకు రూ.35 కోట్లు చెల్లించారని, విలువ మాత్రం రూ.700 కోట్లు ఉందని పేర్కొంది.
మురళీ మోహన్.. కూడా 53 ఎకరాలు కొనుగోలు చేశారని, ఆయన రూ.16 చెల్లించారని, అసలు ఖరీదు మాత్రం రూ.212 కోట్లు అని ఆ పత్రిక పేర్కొంది. రావెల కిషోర్.. తన భార్య రావెల శాంతిజ్యోతి పేర్లతో భూములు కొనుగోలు చేశారని, 55 ఏకరాలు ఆయన కొన్నారని, ఆ భూమి విలువ రూ.82.5 కోట్లు ఉంటే, ఆయన చెల్లించినది రూ.5.5 కోట్లు మాత్రమేనని పేర్కొంది.
పత్తిపాటి పుల్లారావు రూ.39 కోట్లతో 196 ఎకరాలు కొనుగోలు చేశారని, అయితే దాని ప్రస్తుత విలువ మాత్రం రూ.784 కోట్లు ఉందని సాక్షి పత్రిక పేర్కొంది. ఇతరుల పైన కూడా ఆయన భూములు కొనుగోలు చేశారని రాసింది.
నారాయణ 3,600 ఎకరాలు కొన్నారని, ఆయన రూ.432 కోట్లు చెల్లించారని, కానీ దాని ప్రస్తుత విలువ రూ.14,400 కోట్లు అని పేర్కొంది. పత్రికలో ఇంకా తీవ్ర ఆరోపణలే చేసింది. ఎవరు ఎక్కడ భూమి కొన్నారే పేర్కొంది. అయితే, తాను భూమి కొన్నట్లుగా వచ్చిన వార్తలను మంత్రి దేవినేని కొట్టిపారేశారు.