బాలినేనిని టార్గెట్ చేసిన సొంత పార్టీ నేత ఎవరు - వైసీపీలో కలకలం : రాజీనామా చేస్తానంటూ..!!
బాలినేని శ్రీనివాస రెడ్డి. జగన్ కోసం మంత్రి పదవిని వదిలేసిన నేత. సీఎం జగన్ కు బంధువు. పార్టీలో సీనియర్ నేత. అటువంటి ప్రాధాన్యత ఉన్న బాలినేని ఇప్పుడు సొంత పార్టీలో పోరుతో రాజీనామా ఆలోచన వరకు వెళ్లారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేని కేబినెట్ సీటు దక్క లేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగా...ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కేబినెట్ లో కొనసాగిస్తూ.. బాలినేనికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
ఆ సమయంలోనూ ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఆ తరువాత సజ్జల రాయబారం. .సీఎం జగన్ తో భేటీతో శాంతించారు. ఇక, ఇప్పుడు మరోసారి బాలినేని తనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలతో పాటుగా సొంత పార్టీలో పెద్ద నేత టార్గెట్ చేసారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.
బాలినేనికి వ్యతిరేకంగా రాజకీయం
కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తామంటూ ఒంగోలు వైసీపీ నేతలతో పాటుగా... గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు సైతం హెచ్చరించారు. ఒంగోలు ఎంపీ మాగుంట సైతం తన మాట ఎవరూ వినటం లేదని.. గుర్తింపు దక్కటం లేదంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం.
ఇక, బాలినేని టార్గెట్ గా టీడీపీ రాజకీయం చేయటం సహజం. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పైన ఆరోపణలు చేయటంలో కొత్తదనం లేదు. అయితే, తెలుగుదేశంతో కలిసి సొంత పార్టీకి చెందిన ఓ పెద్ద నేత తనను టార్గెట్ చేశారని చెప్పటం ద్వారా ఇప్పుడు ఎవరానేత అనే చర్చ మొదలైంది. ఈ మధ్య కాలంలో బాలినేని కుమారుడు సైతం రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
బాలినేని సీరియస్.. ఆధారాల సేకరణ
జిల్లాలో పలువురు వైసీపీ ముఖ్యులు తమ వారసులను వచ్చే ఎన్నికల ద్వారా రాజకీయ ఎంట్రీ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే..ఒంగోలు జిల్లా కేంద్రంగా ఈ కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. చాలా కాలంగా బాలినేని బంధువు అయిన ఒక పెద్ద నేతతో రాజకీయంగా సత్సంబంధాలు లేవనే ప్రచారం జిల్లాలో ఉంది.
అల్లూరుకు చెందిన కవితారెడ్డి నిత్యం దామచర్ల జనార్దన్, మంత్రి శ్రీనుతో ఫోన్ టచ్లో ఉన్నారని బాలినేని ఆరోపించారు. తనను హవాలా మంత్రి అని ప్రచారం చేయించడంతోపాటు తన కుమారుడు ప్రణీత్రెడ్డిపై దుష్పచారం ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. తాను నిజంగా తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన ప్రకటన చేసారు.
సీఎం వద్దే తేల్చుకోవాలని నిర్ణయం
అల్లూరు కవితారెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే విషయం పైన కాల్ డేటా తీయించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా సొంత పార్టీలోని ఆ నేత ఎవరో బయటకు చెబుతానని బాలినేని చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో ఈ విషయం పైన ఆ సొంత పార్టీ పెద్ద నేతపైన సీఎం వద్దే తేల్చుకొనేందుకు బాలినేని సిద్దమయ్యారు.
విదేశాలకు వెళ్తున్న సీఎం జగన్ జూలై 3న తిరిగి రానున్నారు. 4న ప్రధాని పర్యటన ఉండటంతో..అది పూర్తయిన తరువాత పూర్తి సమాచారం -ఆధారాలతో సీఎం ను కలవాలని బాలినేని నిర్ణయించారు. దీంతో..ఆ పెద్ద మనిషి ఎవరనేది బాలినేని బయటకు చెబుతారా.. సీఎం ఈ వ్యవహారంలో సొంత మనుషుల మధ్య జరుగుతున్న ఈ పంచాయితీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.