పార్టీ మార్పుపై తేల్చేసిన బాలినేని - ఏం చేయబోతున్నారు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీలో సీట్ల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఎంత ఒత్తిడి వచ్చినా సీట్ల మార్పు విషయంలో జగన్ వెనుకడుగు వేయటం లేదు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో మార్పులు, చేర్పులపై కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలోనే సీటు, పార్టీ మార్పు పైన మాజీ మంత్రి బాలినేని స్పష్టత ఇచ్చారు.
ప్రకాశంలో మార్పులు, చేర్పులు
ప్రకాశం జిల్లాలో టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఎంపీ సీటుతో సహా మిగిలిన స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ సారి ప్రతీ సీటు జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 38 సీట్లలో మార్పులు చేసారు. ప్రకాశం జిల్లాలో అయిదు సీట్ల వరకు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని, ఎంపీ మాగుంటతో సహా పార్టీ నేతలతో పార్టీ సమన్వయ కర్త విజయ సాయిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. అందులో సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు. బాలినేని ఈ సారి ఒంగోలు నుంచి గిద్దలూరుకు మారుతారని ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దర్శి నుంచి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీగా సిద్దా రాఘవరావు పేర్ల పైన చర్చ జరిగింది.
సీఎం జగన్ కసరత్తు
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. కానీ, మరోసారి సీఎంను కలిసారు. ఇటు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ ను పిలిపించిన సీఎం సీటు మార్పు పైన ప్రతిపాదనలు ముందుంచారు. దీని పైన వేణుగోపాల్ అభిప్రాయం చెప్పాలని కోరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడుకి సీటు ఇచ్చే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది.
ఈ సమయంలో కనిగిరి సభలో చంద్రబాబు వైసీపీలో కొందరు నేతల గురించి చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. పలువురు వైసీపీ ముఖ్యులు టీడీపీతో టచ్ లోకి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో, ఈ మొత్తం వ్యవహారం పైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
క్లారిటీ ఇచ్చిన బాలినేని
తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేసారు. తాను పార్టీ మారే ఆలోచన లేదన్నారు. తాను జగన్ కోసం మంత్రి పదవి వీడానని..విలువలతో రాజకీయం చేస్తున్నానని బాలినేని చెప్పుకొచ్చారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే సీట్ల మార్పు పైన చర్చ జరుగుతోందన్నారు. ఎంపీ మాగుంట గురించి తాను సీఎం జగన్ తో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.
బాలినేని గిద్దలూరుకు మారుతారనే ప్రచారాన్ని ఖండించారు. దీంతో, సోమ లేదా మంగళవారం మరోసారి సీఎంతో బాలినేని, ఒంగోలు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ భేటీ ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అభ్యర్దుల మార్పు పైన స్పష్టత వస్తుందని తెలుస్తోంది. దీంతో..జిల్లాలో మార్పుల పైన జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications