జగన్కు తూర్పులో భారీ షాక్, టీడీపీలోకి కీలక నేత!: బాబును కలిసిన ఎంపీ అభ్యర్థి
Recommended Video
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
చంద్రబాబుతో భేటీ, అక్టోబర్లో టీడీపీలోకి
వైసీపీ నేత చెలమలశెట్టి సునీల్ మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్గా ఉన్న సునీల్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు సునీల్ సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అక్టోబరు రెండో వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
గతంలోను ప్రచారం
చలమశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. గతంలో కూడా ఈ ప్రచారం సాగింది. అయితే ఈసారి ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది.
ప్రజారాజ్యం, వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి
చలమశెట్టి సునీల్ గతంలో రెండుసార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3వేల ఓట్లతో ఓడిపోయారు.
పలు కారణాలు
సునీల్కు స్థానికంగా మంచి పేరు ఉంది. ఓడిపోయినా అందరికీ అందుబాటులో ఉంటారని అంటారు. గతంలో కాకినాడ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అలాగే, టీడీపీలో ఉన్న కీలక నేతలతో ఆయనకు బంధుత్వం ఉందని చెబుతున్నారు. ఇలా పలు కారణాలతో ఆయన టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది.