గోరంట్ల మాధవ్ కు మరో షాక్- అంతర్యుద్ధం వార్నింగ్ ఎఫెక్ట్ ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన మాజీ సీఐ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయనపై అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో ఆయన చేసిన మరో కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో మరో కేసు నమోదుకు అనంతపురం పోలీసులు సిద్దమవుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రేప్ కు గురైన బాధితుల పేర్లు బయటపెట్టారంటూ ఆయనపై అప్పటి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఆయనకు మార్చి 5న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు అనంతపురం వెళ్లారు. అయితే అదే సమయంలో గోరంట్ల మాధవ్ నోటీసులు తీసుకుంటూనే పోలీసులు, ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో మాధవ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో అనంతపురం పోలీసులు ఇప్పుడు మాధవ్ వ్యాఖ్యల్ని పరిశీలించి కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నారు. మాధవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని తేలితే ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు పిలిచేందుకు రెడీ అవుతున్నారు. దీంతో మాధవ్ కు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications