జగన్ డబ్బున్నవాళ్లే ముఖ్యమన్నాడు.. అందుకే 'గుడ్ బై': సీతారాం సంచలనం
జగన్ డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తాడని, డబ్బు ఖర్చు పెట్టేవారే పార్టీకి ముఖ్యమని ఆయన చెప్పడంతో.. తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నానని సీతారాం అన్నారు.
భీమిలి: పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా.. ఆయా నియోజకవర్గాల్లో జగన్ అంతర్గత సర్వే నిర్వహిస్తున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే పార్టీని జనంలోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్నవాళ్లకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ వ్యూహం మొదలైంది: అప్పుడే గెలుపు గుర్రాల వేట!, 'సర్వే' కీలకం
అదే సమయంలో అప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న వైసీపీ నేతలకు ఈ పరిణామం మింగుడుపడుతున్నట్లుగా లేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కర్రి సీతారాం ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం ఇదే ఎఫెక్ట్ అని తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం పార్టీకి గుడ్ బై చెప్పిన కర్రి సీతారాం.. తన నియోజకవర్గం భీమిలిలో తనకు తెలియకుండానే జగన్ మరో సమన్వయకర్తను నియమించడం తనకు బాధ కలిగించిందన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
జగన్ డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తాడని, డబ్బు ఖర్చు పెట్టేవారే పార్టీకి ముఖ్యమని ఆయన చెప్పడంతో.. తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నానని సీతారాం అన్నారు. 2014ఎన్నికల్లో ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో.. జగన్ మరొకరిని సమన్వయకర్తగా నియమించారని సీతారాం చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని, తన అభిమానులు, మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సీతారాం స్పష్టం చేశారు.