మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఫైర్, రేవంత్పై లక్ష్మీపార్వతి ప్రశంసలు
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి గంటాకు మేకప్ వేసుకోవడానికే టైం సరిపోదని ఆమె ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలు మంత్రి గంటాకు టైమెక్కడిదని
విజయవాడ: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి గంటాకు మేకప్ వేసుకోవడానికే టైం సరిపోదని ఆమె ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలు మంత్రి గంటాకు టైమెక్కడిదని ఆమె ప్రశ్నించారు.
విజయవాడలో ఆదివారం నాడు జరిగిన ఎయిడెడ్ కాలేజీల్లోని అధ్యాపకుల సంఘం సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిడెడ్ కాలేజీల్లో ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆమె ఆరోపణలు చేశారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు ఇస్తున్న జీతంలో సగంలో కూడా ఎయిడెడ్ కాలేజీల్లోని టెంపరరీ ఉద్యోగులకు ఇవ్వడం లేదని లక్ష్మీపార్వతి చెప్పారు.. ఎయిడెడ్ కాలేజీల్లోని అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని ప్రభుత్వం మరిచిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
అధ్యాపకుల సమస్యలపై వైసీపీ తరపున పోరాడతామని ఆమె హమీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిందని ఆమె ఆరోపణలు చేశారు.
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబునాయుడు కబ్జా చేశారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ విధానాలను కొనసాగించడం లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపనలకే పరిమితమైపోయారని చెప్పారు. టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ ధైర్యవంతుడని, చంద్రబాబు కోసం జైలుకు కూడా వెళ్లాడని అన్నారు. ఇద్దరు సీఎంలు ఒకటవడంతో రేవంత్ పార్టీ వీడారని ఆమె అభిప్రాయపడ్డారు. తన అనుమతి లేకుండా తన పేరుతో సినిమా తీస్తే కోర్టుకు వెళ్తానని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి హెచ్చరించారు.