హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ మోదుగుల అసహనం-కోర్టులపై సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అమరావతి రాజధానిపై ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీన్ని విపక్షాలు స్వాగతిస్తుండగా.. అధికార వైసీపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఇదే క్రమంలో నరసరావుపేట మాజీ ఎంపీ, వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టు తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరాపతి రాజధాని విషయంలో హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదన్నారు. తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందంటూ ఆరోపించారు. న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థ లలో ఎవరు గొప్ప అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్దాయి లో చర్చ జరగాలన్నారు.
ఓ దశలో అమరాపతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా అని మోదుగుల ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలంటూ హైకోర్టుకు సూచించారు. అంబేద్కర్ రాజ్యంగాన్ని అవమాన పరుస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసిందని, అందులో బిజేపి పాత్ర కూడా ఉందంటూ రాజకీయ పార్టీలకు సైతం ఆయన చురకలు అంటించారు.
రాష్ట్ర విభజన పై వేసిన పిటిషన్ లపై ఎందుకు వాదనలు జరగడం లేదని మోదుగుల న్యాయవ్యవస్ధను ప్రశ్నించారు. అసెంబ్లీ లో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటంటూ హైకోర్టు తీర్పుపై ప్రశ్నలు వేశారు. మూడు రాజధానులకు మేము కట్టుబడి ఉన్నామని మోదుగుల తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టు లో పిటిషన్ వేశామని,2019 లో వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అమరావతి కంటే ముందు రాష్ట్ర విభజన పిటిషన్ లపై తీర్పు లు ఇవ్వాలని కోర్టుల్ని ఆయన కోరారు.