జగన్పై దాడి చేయడానికి తెలంగాణలో గ్యాంగ్ ఆఫ్ ఫోర్- బాంబు పేల్చిన సజ్జల
అమరావతి: ఏపీలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధిస్తోందని, కేసులు పెట్టి జైలుపాలు చేస్తోందంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇదివరకే స్పందించారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కాలంటే - ఆ రెండే ప్రాథమిక సూత్రాలు..!!
గ్యాంగ్ ఆఫ్ ఫోర్..
ఉన్నట్టుండి హరీష్ రావుకు ఏపీ మీద ఎందుకు అంత ఆవేశం వచ్చిందో తెలియట్లేదంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఈ మధ్య ఆయన తరచూ ఏపీ మీద వివాదాస్పద ప్రకటనలు చేస్తోన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో గ్యాంగ్ ఆఫ్ ఫోర్ తయారయ్యారని, ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తోన్నారని విమర్శించారు.
మామను విమర్శిస్తే సంతోషం ఏమో..
శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య అంశాలపై విమర్శలు చేసుకోవట్లేదని పేర్కొన్నారు. ఆ గ్యాంగ్ ఆఫ్ ఫోర్ క్యాంప్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా హరీష్ రావు అలా వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోందని అన్నారు. హరీష్ రావు ఏపీ ప్రజల ముఖ్యమంత్రిని విమర్శించారని, దీనికి ప్రతిగా తాము ఆయన మామ (ముఖ్యమంత్రి కేసీఆర్)పై విమర్శలు చేస్తే- సంతోష పడతారేమోనని సజ్జల రామకృష్ణారెడ్డి చురకలు అంటించారు.
మంత్రే వ్యాఖ్యానించడం..
ఆ నలుగురి మధ్య ఉన్న గొడవలు, రాజకీయాల్లో ఈ అంశాన్ని తీసుకొచ్చి వాడుకోవాలనుకున్నారేమో తనకు తెలియట్లేదని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎవ్వరే గానీ, ఎప్పుడు కూడా తెలంగాణ రాజకీయాలపై లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయలేదని సజ్జల గుర్తు చేశారు. ఎవరు? ఎలా తమ రాష్ట్రాన్ని బాగు పర్చుకుంటారనేది- ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పారు. కిందిస్థాయి నాయకులెవరైనా ఇలాంటి విమర్శలు చేస్తే దానికి అర్థం ఉంటుందని, దీనికి భిన్నంగా మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
మీ రాష్ట్రంలో..
అధికారంలో ఉన్నందున- తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై ఉందని, ఇంకో రాష్ట్రం నుంచి కామెంట్స్ చేయాల్సిన ఆగత్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని తాను భావించట్లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. హరీష్ రావు చేసినవి విధానపరమైన విమర్శలు కాకపోయినప్పటికీ- ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నామని చెప్పారు.
బురదలో దిగడానికి సిద్ధంగా లేం..
ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారని, అప్పటికీ ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటోన్నామని, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరిస్తోన్నామని సజ్జల స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా వివాదాలు సృష్టించాలని తెలంగాణ అధికార పార్టీ పెద్దలు కోరుకుంటున్నట్టయితే- ఆ బురదలో దిగడానికి తాము సిద్ధంగా లేవమని సజ్జల తేల్చి చెప్పారు.