కేంద్రంలో జగన్ చక్రం తిప్పే పరిస్థిితులు రావాలి: తిరుమలలో సజ్జల..!!
వైసీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవ్వాళ తిరుమలను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
తిరుపతి: పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల భక్తులు పోటెత్తారు. సెలవురోజు కూడా కావడం వల్ల వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. ఫలితంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం 72,226 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 30, 877 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 4.74 కోట్ల రూపాయలు.
చైనాతో ఆ లింక్స్: గుర్తించిన కేంద్ర హోం శాఖ: అత్యవసరంగా సంచలన నిర్ణయం: 200కు పైగా
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో సజ్జల..
వీఐపీల తాకిడి కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. భార్య, కుమారుడు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ భార్గవరెడ్డి, కోడలు, మనవరాలితో కలిసి సజ్జల రామకృష్ణా రెడ్డి తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
అప్రతిహతంగా..
దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపం వద్ద అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి, చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. దర్శనాన్ని ముగించుకుని వెలుపలకు వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణా రెడ్డి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
కష్టకాలంలో కూడా..
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రార్థించానని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కష్ట కాలంలో కూడా రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా పరుగులు పెట్టించారని, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిలిపివేయలేదని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తోన్న యజ్ఞం నిర్విఘ్నంగా సాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఎప్పుడైనా విశాఖ..
మూడు రాజధానుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం త్వరలోనే రూపుదిద్దుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకుంటోన్నారని, వారి మనోభావాలకు అనుగుణంగా అది సాకారమౌతుందని చెప్పారు. సచివాలయాన్ని తరలించడానికి ఏర్పాట్లు సాగిస్తున్నామని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితులు..
విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన అనేక హామీలు నిలిచిపోయాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే కాకుండా కేేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక ప్రయోజనాలు స్తంభించాయని చెప్పారు. వాటిని తెచ్చుకోవడానికి తగిన రాజకీయ పరిస్థితులు కేంద్రంలో ఏర్పడాలని తాను వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉండటం వల్ల రాజకీయపరమైన ఒత్తిడిని తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకునే పరిస్థిితి లేదని, ఈ సారి అలా జరక్కూడదని సజ్జల పరోక్షంగా వ్యాఖ్యానించారు.