పలికినది పట్టాభి: చేతకాని కొడుకుతో: కోల్డ్ బ్లడెడ్ ప్లాన్: అవసాన దశలో చంద్రబాబుకు ఆత్రం: సజ్జల
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మినేని పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించిన అనంతరం నెలకొన్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఒకవంక.. టీడీపీ నాయకులు పిలుపునిచ్చిన ఆందోళనలు, రాష్ట్ర బంద్ మరోవంక ఉద్రిక్తతలకు దారి తీశాయి.

కర్త-కర్మ-క్రియ చంద్రబాబే..
ఈ పరిస్థితులపై పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ను ఉద్దేశించి బోసిడికే అనే పదాన్ని రిపీటెడ్గా అనడం వెనుక టీడీపీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు ఆ పద ప్రయోగం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని విమర్శించారు. చంద్రబాబు నిర్దేశం ప్రకారమే టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో పట్టాభి మాట్లాడారని, దీనికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. కర్త-కర్మ-క్రియ అంతా చంద్రబాబుదేనని పునరుద్ఘాటించారు. మాట్లాడింది పట్టాభి అయితే..మాట్లాడించిన వాడు చంద్రబాబు అని సజ్జల రామకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పలేదా?
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కేంద్రమంత్రి నారాయణ రాణె..చెంపదెబ్బలు కొడతానని చెప్పిందుకు అక్కడ ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీపై విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. చివరికి కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని అన్నారు. అలాంటిది మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బోసిడికే అనే పదాన్ని వాడటం ఎంత దౌర్భాగ్యమని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తే.. ప్రజలను తిట్టినట్టు కాదా? అని ప్రశ్నించారు.

జగన్ సంయమనాన్ని అలుసుగా..
టీడీపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేసినా.. ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోవట్లేదని, తన పని తాను చేసుకుంటూ పోతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇలా పట్టించుకోకపోవం టీడీపీ నేతలను అసహనానికి గురి చేస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సంయమనాన్ని అలుసుగా తీసుకున్నారని చెప్పారు. ఒక బూతు మాటను ప్రమోట్ చేసేలా టీడీపీ నాయకులు రాష్ట్ర బంద్ను పిలుపు ఇచ్చారని, కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తానని అంటున్నారని అన్నారు. ఏమని ఫిర్యాదు చేస్తారని సజ్జల ప్రశ్నించారు.

నోరుజారడం వల్ల కాదు..
పట్టాభి పొరపాటుగానో, నోరు జారటం వల్లో మాట్లాడిన మాటలు కావు అని, టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చుని, అధికార పార్టీ ప్రతినిధి హోదాలో ఇలాంటి మాట మాట్లాడారని చెప్పారు. వందశాతం స్పృహలో ఉండే పట్టాభి ఈ పదాన్ని ప్రయోగించారని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా వైఎస్సార్సీపీ స్పందిస్తుందని తెలిసే.. ఈ కామెంట్ చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు అనే నాయకుడు ఓ సిక్ పర్సన్ అని, ఖమ్మ కాలి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు- తనకు పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, పార్టీని, పదవిని లాక్కున్నప్పటి నుంచే చంద్రబాబు సిక్ పర్సన్గా ఉంటున్నారని ధ్వజమెత్తారు.

అవసాన దశలో చంద్రబాబు..
చంద్రబాబు అవసాన దశలో ఉన్నారని, టీడీపీ పరిస్థితి కూడా అట్లే తయారైందని సజ్జల అన్నారు. ఇంత ఘోరమైన మాట మాట్లాడిన తరువాత దానిపై స్పందించని వాడు మనిషే కాదని, అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా స్పందిస్తారని చెప్పారు. ముందు వాడిన పదం కాలిక్యులేటెడ్, కోల్డ్ బ్లడెడ్ ప్లాన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని సజ్జల వ్యాఖ్యానించారు. క్లియర్గా ఉద్దేశపూరకంగా ఈ కామెంట్ చేశాడనేది తెలుస్తోందని చెప్పారు. తమ నాయకుడిని అంతమాట అన్న తరువాత పార్టీ నాయకులు స్పందించకుండా ఎలా ఉంటారని అన్నారు. అలాంటి పదాన్ని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని సజ్జల ప్రశ్నించారు.

బూతుల పార్టీగా పేరు
రెండున్నరేళ్లుగా వరుసగా చంద్రబాబు ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తూనే వస్తున్నారని, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం వద్ద మొదలైన ఈ తరహా రాజకీయం ఈ రోజుకూ కొనసాగిస్తున్నాడని సజ్జల చెప్పారు. జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, ప్రజల్లోకి వెళ్లిన విధానం, ప్రజల్లో ఉన్న ఆదరణ.. ఇవన్నీ చూసి టీడీపీ తట్టుకోలేకపోతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీగా మారిందంటూ సోషల్ మీడియాలో వస్తోన్న సమాచారం నిజమైందని చంద్రబాబే నిరూపించినట్టయిందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications